Friday, 18 September 2026

రాధాష్టమి

ఓం శ్రీ కృష్ణ శరణం మమ
----------------------------------
*భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది*
*రాధామాధవం ఎంత రమణీయం ! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం. తనను తాను ప్రేమించుకుందుటకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.*
---------------------------------
*మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెన్నేలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.*
----------------------------------- *రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం* *నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.*
----------------------------------
*రాధాకృష్ణులు - ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అప్రాకృతమైన జగత్తులో - ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.*
----------------------------------
*గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.*
----------------------------------
*శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.*
---------------------------------
*శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.*
--------------------------------
*రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం' గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.*
----------------------------------
*వృషభానుడు, కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు - భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి' గా వ్యవహరిస్తారు.*
----------------------------------
*పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.*
--------------------------------
*రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం. రాధా కృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన. టీవీబీసీ*
------------------------------
*' రాధా ! ఈ రోజు నా పుట్టినరోజు. ఏమైనా కోరుకో ఏదైనా ఇస్తాను.'*
-------------------------------
*'మాధవా ! నువ్వు నా స్వంతం. నాకే చెంది ఉన్నావు, ఔనా ?'*
-------------------------------
*'అవును రాధా!’*
--------------------------------
*'నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి. ఇవ్వగలవా కృష్ణా ?'*
---------------------------------
*చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదారవింద యుగళిని తనివితీరా ముద్దాడింది. శశాంకశీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది.*
---------------------------------
*'నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా!’*
----------------------------------
*అదే బృందావనం. ఈ రోజు రాధాష్టమి. రాధ పుట్టిన రోజు. ఈ అరుదైన రోజు కోసం అపూర్వమైన రీతిలో, తన గుణగణాలను దివ్యాభరణాలుగా మార్చి, మనోజ్ఞంగా అలంకరించుకుని సరికొత్త శ్యామసుందరుడు అవతరించాడు. అటు రాధావిలాసం, ఇటు మురళీగాన వినోదం, సరస శృంగార చక్రవర్తి,*
---------------------------------
*రాధికా మానస విహార రాజహంస, సకల భువనైక మోహన దివ్యమూర్తి రాధను మంత్రముగ్ధం చేస్తున్నాడు. జలతరంగిణి మీటినట్టు రాధ నవ్వుతున్నది. జగమంతా అమృతం వర్షిస్తున్నది. ప్రణయ మకరందమాధురీ భరితలోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది.*
------------------------------------
*కృష్ణా ! ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా ! నీ పుట్టినరోజునాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టిన రోజున నువ్వు అలంకరించుకున్నావు. బలే విచిత్రంగా ఉంది కదూ ! ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు.*
----------------------------------
*నువ్వు నా అద్దానివా ? నన్ను నేను చూసుకుం టున్నానా ?'.. సరస భాషిణి, సహజ చమత్కారి కదా రాధ. 'ఈ సంతోష సమయంలో, నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టిన రోజున నేను కోరుకున్నా. నా పుట్టిన రోజున నువ్వు కోరుకో కృష్ణా!’ ఆశ్చర్య చకితుడయ్యాడు కృష్ణుడు తేరుకుని, వొకింత ఆలోచించి, ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు.*
----------------------------------
*'ఏదైనా నువ్వే నన్ను కోరుకో. ఇదే నా కోరిక రాధికా ! అన్నట్లు రాధా !* *నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా ! 'గలగలా నవ్వింది రాధ. 'నీకన్నా విలువైనది నేనే గోపాలా!’*
*హతాశుడయ్యాడు కృష్ణుడు ! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.*
----------------------------------
*'ఏమంటున్నావు రాధా ! నువ్వు నాకంటే విలువైనదానివా ? ఎలా ?'*
----------------------------------
*'భక్తుడికి, భగవంతుడు దాసుడు కాదా, వాసుదేవా!’*
---------------------------------
*'అవును'*
----------------------------------
*'నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా'*
---------------------------------
*'నిజం'*
---------------------------------
*'నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా!’*
---------------------------------
*'అనుమానమెందుకు రాధా!’*
----------------------------------
*'నువ్వు బానిసవు. నేను యజమానురాలిని. నేనే గొప్ప కదూ'*
-----------------------------------
*'ఒప్పుకున్నాను రాణీ! మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు?'*
-----------------------------------
*'ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథా'*
------------------------------------
*కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికింకేమి కావాలి ! కృష్ణుణ్ణి పూజించే వారెందరో, ఆరాధించే వారింకెందరో.*
-----------------------------------
*కానీ, ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరీ ? రాధకు కృష్ణుడి అవసరం కంటె, కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో, లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్ధకత లభించింది.*
--------------------------------
*కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది.*
----------------------------------
*వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు.*
-------------------------------
*'ఏ.. ఏమిటిది! మా.. మాధవా!’ రాధ కంఠం గద్గదమయింది. ఆ ప్రణయమూర్తి మూగదయింది.*
---------------------------------
*'బానిస, యజమానికి నమస్కరించాలి కదా!’*
----------------------------------
*కృష్ణుని వినయ సౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది.*
------------------------------------ *రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవుని కళ్లలో నీళ్లు... రాధ కళ్లల్లో నీళ్లు.. అతని చుబుకాన్ని పైకెత్తి, సూటిగా కృష్ణుని కళ్లల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్లలో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి.*
----------------------------------
*ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి, తీర్థంగా స్వీకరించి యమున తరించింది. పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. జాబిల్లి కళ్ల నుండి జాజులు వర్షించాయి. ఆ అమల ప్రేమికులను, ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి.*
------------------------------------
*యశోదా ప్రియసుతుడు, ఉదయ చంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం 'రాధామాధవం'.*
----------------------------------
*రాధాష్టమి శుభాకాంక్షలు..*
---------------------------------- *🙏🏻ఓం శ్రీ కృష్ణ శరణంమమ🙏🏻* *🙏🏻రాధేకృష్ణ 🙏🏻*
----------------------------------
*ప్రతి నామం ముందు "ఓం" చేర్చి పఠించవలెను.*
----------------------------------
*శ్రీరాధాయై నమః ।*
*శ్రీరాధికాయై నమః ।*
*కృష్ణవల్లభాయై నమః ।*
*కృష్ణసమ్యుక్తాయై నమః ।*
*వృన్దావనేశ్వర్యై నమః ।*
*కృష్ణప్రియాయై నమః ।*
*మదనమోహిన్యై నమః । శ్రీమత్యై నమః ।*
*కృష్ణకాన్తాయై నమః ।*
*కృష్ణానన్దప్రదాయిన్యై నమః । ౧౦ ।*

*యశస్విన్యై నమః ।*
*యశోదానన్దనవల్లభాయై నమః ।*
*త్రైలోక్యసున్దర్యై నమః ।*
*వృన్దావనవిహారిణ్యై నమః ।*
*వృషభానుసుతాయై నమః ।*
*హేమాఙ్గాయై నమః ।*
*ఉజ్జ్వలగాత్రికాయై నమః ।*
*శుభాఙ్గాయై నమః ।*
*విమలాఙ్గాయై నమః ।*
*విమలాయై నమః । ౨౦ ।*

*కృష్ణచన్ద్రప్రియాయై నమః ।*
*రాసప్రియాయై నమః ।*
*రాసాధిష్టాతృదేవతాయై నమః ।*
*రసికాయై నమః ।*
*రసికానన్దాయై నమః ।*
*రాసేశ్వర్యే నమః ।*
*రాసమణ్డలమధ్యస్థాయై నమః ।*
*రాసమణ్డలశోభితాయై నమః ।*
*రాసమణ్డలసేవ్యాయై నమః ।*
*రాసక్రిడామనోహర్యై నమః । ౩౦ ।*

*కృష్ణప్రేమపరాయణాయై నమః ।*
*వృన్దారణ్యప్రియాయై నమః ।*
*వృన్దావనవిలాసిన్యై నమః ।*
*తులస్యధిష్టాతృదేవ్యై నమః ।*
*కరుణార్ణవసమ్పూర్ణాయై నమః ।*
*మఙ్గలప్రదాయై నమః ।*
*కృష్ణభజనాశ్రితాయై నమః ।*
*గోవిన్దార్పితచిత్తాయై నమః ।*
*గోవిన్దప్రియకారిణ్యై నమః ।*
*రాసక్రీడాకర్యై నమః । ౪౦ ।*

*రాసవాసిన్యై నమః ।*
*రాససున్దర్యై నమః ।*
*గోకులత్వప్రదాయిన్యై నమః ।*
*కిశోరవల్లభాయై నమః ।*
*కాలిన్దీకులదీపికాయై నమః ।*
*ప్రేమప్రియాయై నమః ।*
*ప్రేమరూపాయై నమః ।*
*ప్రేమానన్దతరఙ్గిణ్యై నమః ।*
*ప్రేమధాత్ర్యై నమః ।*
*ప్రేమశక్తిమయ్యై నమః । ౫౦ ।*

*కృష్ణప్రేమవత్యై నమః ।*
*కృష్ణప్రేమతరఙ్గిణ్యై నమః ।*
*గౌరచన్ద్రాననాయై నమః ।*
*చన్ద్రగాత్ర్యై నమః ।*
*సుకోమలాయై నమః ।*
*రతివేషాయై నమః ।*
*రతిప్రియాయై నమః ।*
*కృష్ణరతాయై నమః ।*
*కృష్ణతోషణతత్పరాయై నమః ।*
*కృష్ణప్రేమవత్యై నమః । ౬౦ ।*

*కృష్ణభక్తాయై నమః ।*
*కృష్ణప్రియభక్తాయై నమః ।*
*కృష్ణక్రోడాయై నమః ।*
*ప్రేమరతామ్బికాయై నమః ।*
*కృష్ణప్రాణాయై నమః ।*
*కృష్ణప్రాణసర్వస్వదాయిన్యై నమః ।*
*కోటికన్దర్పలావణ్యాయై నమః ।*
*కన్దర్పకోటిసున్దర్యై నమః ।*
*లీలాలావణ్యమఙ్గలాయై నమః ।*
*కరుణార్ణవరూపిణ్యై నమః । ౭౦ ।*

*యమునాపారకౌతుకాయై నమః ।*
*కృష్ణహాస్యభాషణతత్పరాయై నమః ।*
*గోపాఙ్గనావేష్టితాయై నమః ।*
*కృష్ణసఙ్కీర్తిన్యై నమః ।*
*రాససక్తాయై నమః ।*
*కృష్ణభాషాతివేగిన్యై నమః ।*
*కృష్ణరాగిణ్యై నమః ।*
*భావిన్యై నమః ।*
*కృష్ణభావనామోదాయై నమః ।*
*కృష్ణోన్మాదవిదాయిన్యై నమః । ౮౦ ।*

*కృష్ణార్తకుశలాయై నమః ।*
*పతివ్రతాయై నమః ।*
*మహాభావస్వరూపిణ్యై నమః ।*
*కృష్ణప్రేమకల్పలతాయై నమః ।*
*గోవిన్దనన్దిన్యై నమః ।*
*గోవిన్దమోహిన్యై నమః ।*
*గోవిన్దసర్వస్వాయై నమః ।*
*సర్వకాన్తాశిరోమణ్యై నమః ।*
*కృష్ణకాన్తాశిరోమణ్యై నమః ।*
*కృష్ణప్రాణధనాయై నమః । ౯౦ ।*

*కృష్ణప్రేమానన్దామృతసిన్ధవే నమః ।*
*ప్రేమచిన్తామణ్యై నమః ।*
*ప్రేమసాధ్యశిరోమణ్యై నమః ।*
*సర్వైశ్వర్యసర్వశక్తిసర్వరసపూర్ణాయై నమః ।*
*మహాభావచిన్తామణ్యై నమః ।*
*కారుణ్యామృతాయై నమః ।*
*తారుణ్యామృతాయై నమః ।*
*లావణ్యామృతాయై నమః ।*
*నిజలజ్జాపరీధానశ్యామపటుశార్యై నమః ।*
*సౌన్దర్యకుఙ్కుమాయై నమః । ౧౦౦ ।*

*సఖీప్రణయచన్దనాయై నమః ।*
*గన్ధోన్మాదితమాధవాయై నమః ।*
*మహాభావపరమోత్కర్షతర్షిణ్యై నమః ।*
*సఖీప్రణయితావశాయై నమః ।*
*కృష్ణప్రియావలీముఖ్యాయై నమః ।*
*ఆనన్దస్వరూపాయై నమః ।*
*రూపగుణసౌభాగ్యప్రేమసర్వాధికారాధికాయై నమః ।*
*ఏకమాత్రకృష్ణపరాయణాయై నమః ।*
-----------------------------------
*ఇతి శ్రీరాధాష్టోత్తరశతనామావళిః సంపూర్ణం*
------------------------------------ *"రాధాయ నమః " మహా మంత్రం.*
---------------------------------
*అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలోపరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.*
----------------------------------
*రాధాకృష్ణులు - ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.*
------------------------------------
*అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన*
*లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.*
----------------------------------
*గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.*
--------------------------------
*శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.*
-----------------------------------
*రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా* *మారుతుందని* *వరమిచ్చాడనీ ఆ గాథ* *సారాంశం. వృషభానుడు,*
*కళావతి దంపతులకు* *పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు.*
-----------------------------------
*బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.* *శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.*
*పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.*
----------------------------------
*రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం.*
-----------------------------------
*రాధాకృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన.*
----------------------------------
*భాగవతంలో పెద్దగా చర్చించని రాధాకృష్ణుల గురించి ఏ పురాణం వివరిస్తుంది?*
----------------------------------
*శ్రీకృష్ణుని అష్టమహిషులు ఉండగా ఎన్నో చోట్ల రాధాకృష్ణుల ఆలయాలు ఉండడం, వారి కీర్తనలు బహు ప్రచారంలో ఉండడం, ప్రేమైకస్వరూపంగా వారి గురించి చర్చించడం చూసాము. వారి గురించి లోకంలో ఎన్నో దివ్యగాధలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అనవసరమైన తప్పుడుకధలు కూడా చాలా ప్రచారం జరుగుతున్నాయి. ఎలాగైతే సూర్యునిగురించి ఎవడో ఏదో తప్పుడు కూతలు కూసినా ఆయన ప్రభావానికి లోటు లేదో, రాధాదేవి గురించి తెలియకపోయినా, తెలివితక్కువ కధలకు విలువ ఇచ్చినా ఆవిడకు వచ్చిన లోటేమీ లేదు.*
------------------------------------
*శ్రీమద్భాగవతం లో చాలా క్లుప్తంగా వివరింపబడిన రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....*
----------------------------------
*1)దేవీభాగవతం:- నవమ స్కంధంలో గోలోకం గురించి ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. రాధాదేవి శ్రీకృష్ణ ప్రాణాధిక, అలాగే శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారినుండే బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు, ద్విభుజ కృష్ణుని నుండి చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భావించాడో వారినుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మీ, గంగా, సరస్వతీ, తులసీ ఉద్భవం వంటి వివిధ రోమాంచక ఘట్టాలన్నీ నవమస్కంధం వివరిస్తుంది. శ్రీకృష్ణుని శక్తి రాధగా నిలుస్తుంది. రాధాకృష్ణులు వేరు వేరు అని అనుకోవడం వారి మాయకు లోను కావడం. ఆవిడ శ్రీకృష్ణ నిత్యానుపాయిని.*
-----------------------------------
*2)బ్రహ్మవైవర్తన పురాణం:- ఈ పురాణం సంపూర్ణంగా రాధాకృష్ణుల గురించి చెబుతుంది. బ్రహ్మ, ప్రకృతి, గణేశ, కృష్ణ ఖండాలుగా ఉన్న ఈ పురాణంలో సగభాగం కృష్ణ ఖండం. ఈ పురాణం అంతా రాధాదేవి తత్త్వం గురించి, రాధామాధవులను అర్ధనారీశ్వర తత్త్వంలో వివరిస్తుంది. ఈ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, రాధమ్మే పరబ్రహ్మమహిషి. దుర్గ, లక్ష్మి, సరస్వతి ఇత్యాది ప్రకృతి రూపాలన్నీ కూడా రాధ నుండి ఉద్భవించినవే. స్త్రీతత్త్వాన్ని ఎవరైనా అవమానిస్తే రాధను అవమానించినట్టు అని చెబుతుంది ఈ పురాణం. చైతన్యమహాప్రభు ఇత్యాది భక్తి రస వేదాంతులకు పరమ ఉత్కృష్టమైనది ఈ బ్రహ్మవైవర్తన పురాణం. శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణుల రాసలీలలు, వ్రజభూమి లో వారి ఆటపాటలు వంటి ఎన్నో శ్రీకృష్ణ మానవావతార ప్రధాన ఘట్టాలన్నీ విపులంగా వివరింపబడ్డాయి. అమ్మవారి చైతన్య తత్త్వం గురించి ప్రకృతి ఖండం విస్తారంగా చెబుతుంది.*
----------------------------------
*3)బ్రహ్మాండ పురాణం:- ఉపోద్ఘాతపర్వంలో పరశురాముడు గజాననుని దంతం తన పరశువుతో ఖండించినప్పుడు పార్వతి దేవిని శాంతపరచడానికి రాధాసహిత కృష్ణుడు ప్రత్యక్షమై తన సహోదరిని ఊరడింప చేస్తాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు వారిని చేసిన స్తోత్రం గృహేరాధే వనే రాధే జగత్ప్రసిద్ధం.*
------------------------------------
*4)స్కాందపురాణం:- వైష్ణవఖండంలో భాగవతమహాత్మ్యం వర్ణనలోను, వాసుదేవ మహాత్మ్యంలోను శ్రీకృష్ణుని ఆత్మ గా రాధమ్మను కీర్తిస్తారు. దీనిలోనే గోలోక ప్రాశస్త్యం, నారదునికి రాధాకృష్ణుల దర్శనభాగ్యం వంటి ఎన్నో ఘట్టాలు వివరింపబడి ఉన్నాయి.* 
-----------------------------------
*5)నారదపురాణం:- నారదుడు యుగళ సహస్రనామం చేసినప్పుడు మొదటి 500 నామాలు కృష్ణుని కీర్తిస్తే తదుపరి ఐదు వందల నామాలు రాధా కీర్తన. అమ్మవారి తత్త్వం అర్ధం చేసుకోవడం కోసం నారదుడు బృందావనంలో ఒక గోపికగా అవతరించి రాధమ్మ పార్శదునిగా ఆత్మానందం అనుభవిస్తాడు.* 
-----------------------------------
*6)పద్మపురాణం:- భూమిఖండంలో రాధాష్టమి, రాధాదామోదర వ్రతం విశేషాలు విస్తారంగా వివరింపబడి ఉంటాయి. పాతాళఖండంలో రాధామాధవుల రాసలీల, వారి పరబ్రహ్మ నిరూపణ, గోలోకంలో వారి లీలలు, నందవ్రజంలో వారు చేసిన అధ్బుత విన్యాసాలు, అర్జునుని అభ్యర్ధన మేరకు అర్జునుని అర్జుని అని పేరు గల గోపికగా మార్చి పరబ్రహ్మ ప్రకృతీ పురుషుల దర్శనం ఇవ్వడం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.* 
------------------------------------
*7)విష్ణుపురాణం:- 13.వ సర్గలో రాసలీల వివరణ రాధ యొక్క గొప్పదనం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.*
------------------------------------
*8)గర్గ సంహిత:- దీనిలో రాధాకృష్ణుల రాసలీలలు, వారి దివ్యప్రబోధాలు, బృందావనంలో వారి ఆటపాటలు, అటుపై రాధ విరహవేదన, మరల సిద్ద్దాశ్రమంలో వారి కలయిక వంటి అద్భుత లీలలు వర్ణింపబడి ఉన్నాయి.*
----------------------------------
*ఇవి కాక మత్స్యపురాణం లో బృందావనంలో రాధ ఉన్న అమ్మవారికి నమస్సులు అని స్తోత్రం, ఋగ్వేదంలో రాధాసంహితలోను, అథర్వణ వేదంలో రాధాతపనీయ ఉపనిషత్తులో రాధా స్తోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు.* 
-----------------------------------
*ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాధాకృష్ణుల తత్త్వం తెలుసుకునే భాగ్యం కలగదని అప్పటికి కానీ వారికి ఆ లీలలు అనుభవించి శ్యామసముద్రంలో (అంటే కృష్ణునిలో అంటే మోక్షం ) కలిసే అవకాశం ఉండదని పురాణం చెబుతుంది. అటువంటి ఎంతో ఉత్కృష్టమైన తత్త్వం రాధ తత్త్వం. వారి పాపరాశిని దగ్ధం చేసే అవకాశం వీరి చరితం తెలుసుకోవడం. అదే వారి పాపరాశి పోగుచేసుకునేవాళ్ళు వీరి మీద అనవసరపు పైత్యాన్ని ప్రకటించుకుంటూ తమను తాము అధఃపాతాళానికి తీసుకుపోతూ ఉంటారు.

No comments:

Post a Comment