Saturday, 1 June 2024

రాయల వారి ఆలయం

మీకు తెలుసా?
శ్రీవారికి రాయలు సమర్పించుకున్న ఆభరణాలు ఎన్ని? 
తిరుపతి ఆలయంలో రాయల విగ్రహాలు ఎందుకు ఉన్నాయి?
రాయలవారు తిరుపతికి ఎన్ని సార్లు వచ్చారు?
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
 సువర్ణాక్షరాలతో లిఖించబడిన చరిత్ర....
దేశభాషలందు తెలుగులెస్స అని చాటిన కీర్తి....
వజ్రాలను వీధుల్లో రాసులుగా పోయించిన ఘనత....
సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా ప్రఖ్యాతి....
కృష్ణదేవరాయల సొంతం !

విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు జనరంజకంగా పాలించాడు. అందుకే ప్రజలు రాయలవారిని దేవుడిగా భావించారు. కాగా రాయలవారు తిరుమల వెంకటేశ్వరస్వామిని మనసారా ఆరాధించాడు ! మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీనివాసుడికి అపురూప కానుకలు సమర్పించిన మహారాజుల్లో దేవరాయలది మొదటి వరస! 

👉తిరుమల దర్శనం - ఆభరణాలు 

రాయలవారు తన జీవితకాలంలో....1513 నుంచి 1521 మధ్యకాలంలో ఎనిమిది సార్లు వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నట్టు 
శాసనాలు ఆధారంగా తెలుస్తున్నది. తిరుమల శాసనాల్లో మాత్రం ఏడుసార్ల దర్శనం తాలూకు వివరాలు లభ్యం అవుతున్నాయి. దర్శనం సమయంలో అత్యంత విలువైన వెలకట్టలేని ఆభరణాలను శ్రీవారికి సమర్పించారని కూడా ఈ శాసనాలు చెబుతున్నాయి.

తిరుమల ఆలయంలో లభ్యమైన 1200కు పైగా శాసనాల్లో.... 50 శాసనాలు కృష్ణరాయలవారికి సంబందించినవే. ఈ శాసనాలు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఉన్నాయి. వీటిలో కృష్ణదేవరాయలుతో పాటుగా ఆయన దేవేరులైన తిరుమలాదేవి, చిన్నాదేవిల ప్రస్తావన ఉన్నది.

▪️మొదటిసారి దర్శనం

1513, ఫిబ్రవరి 10 వ తేదీన కృష్ణదేవరాయలు మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంలో....

1 ) 3.3 కేజీల నవరత్న కిరీటం,
2) ముత్యాలు పొదిగిన మూడుపేటల కంఠహారం,
3) 25 వెండి హారతి పళ్లాలు
4 )శ్రీనివాసుడి ఏకాంతసేవలో ఉపయోగించే రెండు బంగారు గిన్నెలు దేవేరులైన చిన్నాదేవి, తిరుమలదేవిల సమేతంగా ప్రత్యేకంగా సమర్పించారు.

▪️రెండవసారి దర్శనం

1513, మే 2 వ తేదీన రెండు నెలల వ్యవధిలో కృష్ణదేవరాయలు రెండోసారి తిరుమలకు యాత్ర చేసాడు..ఈ సందర్భంలో

5 ) వజ్రాలు, కెంపులు, పచ్చలు, రత్నాలు పొదిగిన   
      662 గ్రాముల మొలతాడు
7) వైజ్రవైఢూర్యాలు పొదిగిన కత్తి,
8) 132 గ్రాముల నిచ్చకం కఠారి,
9) ముత్యాలతో కూడిన కఠారి,
10) వజ్రాల కఠారి,
11) 98 గ్రాముల వజ్రాల పతకం,
12) 168 గ్రాముల నిచ్చకం భుజకీర్తుల జోడు,
13) 205 గ్రాముల బంగారుపేట,
14) 276 గ్రాముల వజ్రాలమాల
15 ) 573 గ్రాముల వజ్రాల భుజకీర్తులు,
16) ఉత్సవమూర్తులను అలంకరించేందుకు 380 గ్రాముల బరువైన మూడు వజ్ర కిరీటాలు
సమర్పించుకున్నాడు

▪️మూడవసారి దర్శనం

 1513, జూన్‌ 13 వ తేదీన ఒక నెల వ్యవధిలో దేవరాయలవారు మూడోసారి శ్రీవారిని దర్శించుకున్నాడు.
ఈ సందర్భంలో....

17) జతలకొద్ది బంగారు గిన్నెలు 
18) జతలకొద్ది నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు
వీటితో పాటుగా 
19) నిత్య నైవేద్యాల నిమిత్తం ఐదు గ్రామాలను దానముగా రాసి ఇచ్చాడు

ఇదే సమయంలో ప్రతి ఏటా తమిళనెల తైమాసంలో తన తల్లిదండ్రుల ఆత్మోద్ధరణ కోసం ఉత్సవం ప్రారంభించారు.

▪️నాల్గవసారి దర్శనం

1514, జులై 6 వ తేదీన తన జైత్రయాత్రలో భాగంగా తిరుమలేశుని నాల్గవమారు దర్శించుకున్నాడు. ఆ సమయంలో కృష్ణదేవరాయలు ఉదయగిరి కోటను జయించి విజయనగరానికి తిరిగివెళుతున్నాడు. తన విజయానికి జ్ఞాపకంగా సతీ సమేతముగా శ్రీవారికి కనకాభిషేకం చేశాడు.
20) 30వేల బంగారు వరహాలతో ఈ అభిషేకం  
       గావించాడు.
21) 250 గ్రాముల బంగారు త్రిసరం దండ, రెండు    
        వజ్రాల కడియాలు ఇచ్చుకున్నాడు.

22)వేంకటేశ్వరుడి నిత్యారాధనకు తాళ్లపాక గ్రామాన్ని దానంగా రాసిచ్చాడు.
23) ముత్యాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన 225న్నర గ్రాముల చక్రపాదకం తిరుమలాదేవి తరుపున సమర్పించడం జరిగింది.
 24 ) చిన్నాదేవి తరుపున _
200 గ్రాముల వజ్రాలు పొదిగిన మూడు కంఠమాలలు,
25 ) నిత్య కైంకర్యాల కోసం ఓ గ్రామం,
సమర్పించడం జరిగింది.

▪️ ఐదవసారి దర్శనం

1515, అక్టోబరు 25 వ తేదీన రాయలవారు...
కళింగ వరకు తన విజయనగర సామ్రాజ్యం విస్తరించిన శుభ సమయాన్ని పురస్కరించుకొని ఐదవసారి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నాడు.
ఈ విజయోత్సాహంలో

26) 27 కేజీల బరువున్న మకరతోరణాన్ని కానుకగా ఇచ్చాడు.

▪️ఆరవసారి దర్శనం

1517, జులై 2వ తేదీన....కళింగ
దేశాన్ని పూర్తిగా స్వాదీనపరుచుకుని తిరుగులేని మహారాజుగా రాయలవారు ఆరవసారి తిరుమల సందర్శించారు. ఈ సందర్బంగా....

27) వేంకటేశ్వరుడి ఆనంద నిలయానికి 30 వేల వరహాలతో బంగారు తాపడం చేయించాడు .
ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం 1518 సెప్టెంబరు 9న పూర్తయింది
28) స్వామి వారికి ప్రత్యేకంగా బంగారు కంఠమాల 29) విలువైన బంగారు పతకం
సమర్పించుకున్నాడు

▪️పట్టపురాణులతో తన విగ్రహం

ప్రస్తుతం భక్తులు తిరుపతి యాత్ర వెళ్లి శ్రీవారిని దర్శించడానికి ముందు కృష్ణరాయమండపంలోకి ప్రవేశిస్తారు. ఈ మండపం కుడివైపున కృష్ణదేవరాయలు విగ్రహం తన దేవేరుల తో కలిసి ఉంటుంది. శ్రీచక్ర శుభనివాసుడికి ఈ విగ్రహాలు భక్తి పూర్వకంగా ప్రణమిల్లుతున్నట్టు ప్రతిష్టితులై కనిపిస్తారు. ఈ విగ్రహాలను దేవస్థానం వారు ప్రతిష్టించలేదు. కృష్ణదేవరాయలు వారే స్వయంగా తన ఆరవసారి తన దర్శనంలో భాగంగా
ఆలయంలో ప్రతిష్టించుకున్నారు. తనకు అంతులేని సంపదను రాజ్యాన్ని ఇచ్చిన శ్రీవారి చెంతన తాను శాశ్వతంగా మిగిలిపోయి తిరుమల వైభవాన్ని మహిమను చాటుతూనే ఉండాలనే ఉద్దేశంతో రాయలు వారు విగ్రహరూపంలో ఇక్కడ మిగిలిపోయారు.రాజైనా మహారాజైనా దేవుడి ముందు దాసోహులే కదా! 

▪️ఏడవసారి దర్శనం

518, అక్టోబరు 16 వ తేదిన దేవేరి తిరుమలాదేవితో కలిసి రాయలవారు ఏడవమారు తిరుమలకు వచ్చాడు. కమలాపురం శాసనాల్లో ఈ సమాచారం ఉన్నది.ఈ యాత్రకు సంబంధించిన ఆధారాలు తిరుమల శాసనాల్లో లేవు కాబట్టి, ఈ సందర్బంగా సమర్పించుకున్న కానుకల వివరాలు లభ్యం కావడం లేదు.

▪️ఎనిమిదవసారి దర్శనం

క్రీ.శ. 1521, ఫిబ్రవరి 17 వ తేదీన కృష్ణదేవరాయలు తిరుమల శ్రీవారిని ఎనిమిదవమారు 
దర్శనం చేసుకున్నాడు. ఈ సందర్భంలో...

30) రత్నాలు పొదిగిన వింజామర..
31) 31 కేజీల 124 గ్రాముల మకర తోరణం 
32) నవరత్న ఖచిత పీతాంబరం..
33) 10 వేల బంగారు వరహాలు
34) రత్నాలు, పచ్చలు, నీలాలు పొదిగిన కుళ్లాయి, సమర్పించుకున్నాడు.

👉స్వామివారి విశిష్టత

స్వామివారి విశిష్టత, తిరుమల వైభవం, రాయలు సమర్పించుకున్న ఆభరణాలు, ఈ మొత్తం వివరాలు
డా..సాదు సుబ్రమణ్యశాస్త్రిగారు తన 
 ""‘తిరుపతి శ్రీ వెంకటేశ్వర"" పుస్తకంలో రాసారు. ఈ పుస్తకం 1921లో ప్రచురించబడింది. ఈ పుస్తకం ప్రకారం పైన తెలిపిన ఆభరణాలు మాత్రమే కాకుండా, వెలుగులోకి రాని మరెన్నో ఆభరణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది.

No comments:

Post a Comment