Friday, 5 April 2019

శ్రీ కాళహస్తి స్థల పురాణం

భక్త కన్నప్ప  మహా భక్తుడు శ్రీకాళహస్తి ఈశ్వరూడుకు తన నేత్రం ప్రసాదించి తిన్నడు ఐయాడు శివ రాత్రి పర్వదినం నాడు కనప్ప  కు మొదటి పూజ జరపడం ఆనవాయతి.

పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయు లింగం వీటిని కలిపి పంచభూత శివలింగాలు అని అంటారు. పంచభూత లింగాలలో వాయు లింగం ఉన్న పుణ్యక్షేత్రమే శ్రీకాళహస్తి. మరి శ్రీకాళహస్తి లో దాగి ఉన్న కొన్ని నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో శ్రీకాళహస్తి పట్టణం ఉంది. ఈ నగరం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 12 వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు కట్టించాడని చరిత్ర చెబుతుంది. అతి ప్రాచీన ఆలయమని చెప్పబడే ఈ ఆలయంలో పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం ఉంది. ఈ ఆలయ గర్భాలయంలో రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనం. ఇంకా మరోదీపం ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడి స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. ఇక్కడి అమ్మవారి తల భక్తుల కోరికలను వింటునట్లుగా ఒకవైపు తలని వాల్చినట్లు దర్శనమిస్తుంటుంది. ఇలాంటి అమ్మవారి విగ్రహము ఈ ఆలయంలో తప్ప మరొక ఆలయంలో కనిపించదు.
ఈ ఆలయంలో ముందుగా పాతాళగణపతి కనిపిస్తారు. ఈ స్వామిముందు నిలబడి నాలుగు సార్లు వినాయకుడిని తలుచుకుంటే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇంకా ఈ ఆలయంలో పాతాళ గణపతి ఉత్తరం వైపు, జ్ఞానప్రసూనాంబ తూర్పువైపు, కాళహస్తీశ్వరుడు పశ్చిమం వైపు దక్షిణామూర్తి దక్షిణం వైపు తిరిగి ఉంటారు. ఈవిధంగా ఒకే దేవాలయంలో నలుగురు దేవతలు నాలుగు వైపులా చూస్తూ దర్శనం ఇవ్వడం అనేది విశేషం.

దేశంలో అన్ని ఆలయాల్లో గ్రహణం ఉన్నంతసేపు ఆలయాన్ని మూసివేస్తారు. కానీ గ్రహణం రోజున కూడా తెరిచే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి. ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలిగిపోయి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో కాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడు. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. కాశీక్షేత్రం వలే ఇక్కడ చనిపోయే వారికీ పరమశివుడు ఓం కార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకం.

పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడు. ఈ క్షేత్రంలోని శివలింగం వర్తులాకారంవలె గాక చతురస్రముగా ఉంటుంది. స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం బ్రహ్మకి జ్ఙానమును ప్రసాదించిన ప్రదేశం అని చెబుతారు. ఈ పవిత్ర స్థలంలో పరమేశ్వరుడిని అత్యంత భక్తితో శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు ఈ మూడు ప్రాణులు పూజించి ముక్తి పొందినవి. అందువలనే ఈ స్థలమునకు శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినది అని చెబుతారు.
ఈ ఆలయం దేశంలోని అతి పెద్ద ఆలయాలలో ఒకటిగా చెబుతారు. ఆలయంలోపల అమ్మవారి సన్నిధి కి సమీపంలో ఒక ప్రదేశం నుండి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలు సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది.

No comments:

Post a Comment