శ్రీ కాళహస్తీశ్వర ఆలయం లో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసునాంబా అమ్మవారికి వేడి నీటి తో అభిషేకం చేయడం ఆనవాయితీ అందులో భాగంగా నటరాజ స్వామి కి అభిషేకం జరిగింది
Tuesday, 29 December 2020
Wednesday, 23 December 2020
పెళ్ళికాని వారికి సుబ్రమణ్యా స్వామి పఠనం
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.
స్త్రీలకళ్యాణ ప్రాప్తికి రుక్మిణీ కళ్యాణం ఉన్నట్లే, మగవారికి శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణం చక్కని అద్భుతమైన పరిష్కారం.
వివాహ సమస్యలు ఉన్న మగవారు " శ్రీ సుబ్రహ్మణ్యుని కళ్యాణం " 41 రోజులు భక్తి, శ్రద్ధ, విశ్వాసములతో పారాయణ చేసి, ప్రతీ రోజూ తమ స్వహస్తాలతో ఏదైనా స్వామి వారికి నివేదన చేసి, ప్రతీ రోజూ శ్రీ సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేసి, గోత్రనామాలతో అర్చన చేయించుకోవాలి. సంకల్పం చెప్పే సమయంలో " వివాహ దోష పరిహారార్ధం " అని చెప్పి, స్వామిని దర్శించుకుని వస్తుంటే తప్పక సకల వివాహ దోషాలు పరిష్కరించబడతాయి. స్వామి వారి అనుగ్రహం వలన తప్పక శుభం కలుగుతుంది. ఇది ఎందరో జీవితాలలో జరిగినది.
నివేదన చేయడానికి పెద్దగా ఆలోచించవద్దు, మీ శక్తి మేరకు పాలలో చెక్కర కలిపి నివేదించవచ్చు, అటుకులు బెల్లము కలిపి నివేదించవచ్చు, అరటి పండు ముక్కలు చేసి పాలు పెరుగు చెక్కర తేనే నెయ్యి కలిపి నివేదించవచ్చు, ఇవే కాదు మీ శక్తి మేరకు ఏదైనా నివేదించవచ్చు, బాధ పడుతున్నవారు తమ స్వహస్తాలతో తయారు చేయాలి. మీ దగ్గర శ్రీ వల్లీ కల్యాణం మరియూ శ్రీ దేవసేనా కళ్యాణం ఉంటే వాటిని చదవండి. అవి రెండూ లేకుంటే ఈ పోస్ట్ లో ఉన్నది మీరు ప్రతీ రోజు పారాయణ చేయవచ్చు. అలానే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రము, శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామాలు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకము చదవడం ఎంతో శ్రేయశ్కరం. కావలసినదల్లా భక్తి, శ్రద్ధ, విశ్వాసము మాత్రమే. ఫలితాల గురించి ఆలోచించవద్దు, అనుమానము, ఆందోళన వద్దు. ఇది ఎవరికి వారు చేస్తే మంచిది, తమ పిల్లల కోసం చేయవచ్చా అని కొంతమంది అడుగుతుంటారు, తప్పని పరిస్థితుల్లో చేయవచ్చు కానీ ఎవరికి వారీ చేస్తే ఉత్తమ ఫలితం శీఘ్రముగా కలుగుతుంది. తప్పక శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలిగుతుంది. నాకు తెలిసిన పరిష్కారం చెప్పాను, కొందరికైనా ఇది ఉపయోగపడితే నా శ్రమకు సార్ధకత అందినట్లుగా భావిస్తాను.
మొదటగా సుబ్రహ్మణ్యుని చరిత్ర పఠించాలి. ఈ పోస్ట్ లో సుబ్రహ్మణ్యుని చరిత్ర, శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం, శ్రీ దేవసేనా సుబ్రహ్మణ్యుల కళ్యాణం ఉన్నాయి. భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠించండి.
స్కందోత్పత్తి – కుమారసంభవం
మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేసాయి. దితియందు మార్పురాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యపప్రజాపతిని ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అపుడు ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా ! నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.
ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగానరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ ముక్కలుగా నరికేశాడు. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరల భంగపాటు అయింది.
ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు. వాడికి దేహమునందు బలం ఉన్నది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. బ్రహ్మ ‘నాయనా! నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ‘మహానుభావా! అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమయిన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ‘వరాంగి’ అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి, వరాంగికి పెళ్ళిచేశారు.
వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగితే వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ! వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది.
తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు.
తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా! ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దహిస్తాడు. ఆయన కామారి. ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు.
తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.
లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకువిల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదలించ లేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారీ ! శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మోహితుడు కాలేదు. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.
ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివతేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరు కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. ఈశ్వరా! మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పడకుండు గాక! ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేక పోయాడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా! దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను? అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదlu, దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది.
ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.
ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేసారు. ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనకే ‘గుహా’ అనే పేరు ఉంది. పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు.
#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి
#సంభవామి_యుగే_యుగే
శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం
ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల ఒకతె అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడూ. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు
కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఈతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.
ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటె నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు. నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదు. అని. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది.
అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదా అన్నాడు. అపుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహతప్పిపోయారు. అప్పుడు వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అపుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పది సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.
నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అపుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలూ లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.
శ్రీ దేవసేనా సుబ్రహ్మణ్యుల కళ్యాణం
అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసాడు. వివాహంచేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి.
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పరిపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు
శుభం భవతు
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "
అందరం భక్తితో " ఓం శం శరవణభవ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు
Monday, 21 December 2020
గోవు యొక్క విశిష్టత
🐂 *గోవు పాదాల యందు - పితృదేవతలు ఉంటారు.*
🐂 *కాళ్ళ యందు - సమస్త పర్వతములు ఉంటాయి.*
🐂 *భ్రూమధ్యమున - గంధర్వులు ఉంటారు.*
🐂 *గోవు దంతముల యందు - గణపతి ఉంటాడు.*
🐂ముక్కున - శివుడు ఉంటాడు.
🐂 *ముఖమున - జ్యేష్ఠాదేవి ఉంటుంది.*
🐂 *కళ్ళయందు - సూర్యుడు ఉంటాడు.*
🐂 *గోవు చెవుల యందు - శంఖు చక్రములు ఉంటాయి.*
🐂 *కంఠమునందు - విష్ణుమూర్తి ఉంటాడు.*
🐂 *భుజమున - సరస్వతి ఉంటుంది.*
🐂 *రొమ్మున - నవ గ్రహములు కొలువై ఉంటాయి.*
🐂 *వెన్నులో - వరుణ దేవుడు , అగ్ని దేవుడు ఉంటారు.*
🐂 *తోక యందు - చంద్రుడు ఉంటాడు.*
🐂 *చర్మమున - ప్రజాపతి ఉంటారు.*
🐂 *గోవు రోమాల్లో- త్రిలోకాల్లోఉన్న దేవతలు ఉంటారు.*
🌹🐂 *అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు, గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు.. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది.*🐂🌹
*ఓం నమో నారాయణాయ*
Tuesday, 15 December 2020
ధనుర్మాసం
సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది.
సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడము అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.
భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అంటే మంగళ కరమైన అని , ‘పావై’ అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది.
ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి.
ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు.
ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గులతో కనుల విందుగా వుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు “సంక్రాంతి “పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్ర వచనం
శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా.
Saturday, 12 December 2020
💐💐💐శనీశ్వరుడు💐💐💐
సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి, అతని రెండవ బార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.*
*నవగ్రహాలకు రారాజు, ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఆయన సతీమణి సం జ్ఞాదేవి. వారికిరువురు సంతానం. ‘‘యముడు, యమునా’’… వారే య మధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞా దేవి తన నీడ నుంచి తనలాంటి స్ర్తీని పుట్టించి ఆమెకు ‘ఛాయ’అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర వుండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది.*
*తన ప్రేమాను రాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగెను. ఆటలాడు కొను సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయబేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు. దానికి ఛాయదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి *‘‘యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా వుండమని ఎవరైనా నీ నదిని సృశించినా, స్నానం చేసి నా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు. అలాగే యమునికి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు యముడిని యమలోకానికి, పట్టా భిషేకము చేయించాడు.*
ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో *‘‘నీ కాలు మంటలలో కాలుతుంది’’* అని శపించగా, ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుండును అని, రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండి పోతుందని, నా వరం వల్ల నీ కాలు నీటిలో వుంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం వుండదని తండ్రి చెప్పెను. అందుకే యమునికి ‘‘సమవర్తి’’ అనే పేరుంది.
*(ధర్మాధర్మాలను, నీళ్లు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక). శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను.అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు.* *ఆయువుకి అధిపతిగా, జనులపై ఆతని ప్రభావం వుండేట్లుగా అన్న మాట. శివుడు అయితే శని, యముని ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముడులాగా!*
జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు ‘పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర; ప్రతివారి జాతకంలో ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తువుంటాయి.
*వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి వ్యక్తి ఎం తో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనం గడిపి, ‘శని’’గాడు అని ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించ వచ్చు!*
*మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్ అన్నీ కూడా శని వల్ల జరుగుతా యి. మనసులలో జోక్యం, అనారోగ్యా లు, చేద్దామనుకున పనులన్నీ వాయిదాలు, మానసి క శాంతి అన్నీ శని దేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి.*
అలానే కాకుండా ఈ ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మ శని, వ్యయ శని, ద్వితీయ శనిలో దాదాపుగా 2 1/2 సం చొప్పున 7 1/2 సం శని వుండటం వలన ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతో విద్వేషాలు, ‘నా’ అన్న వారితో వైరాలు, మంచికెడితే చెడు ఎదురవ్వటం, అప్పులు, హాస్పిటల్ దర్శనాలు ఇలా అనేకరకమైన ఇ్బందులు. ఇంతేకా కుండా అర్ధాష్టమ, అష్టమ శనులు నడి చేటపుడు కార్యాల యందు అసంతృప్తి, మోకాలు, స్పాండిలైటిస్, నరాలు మొదలైన ఇబ్బందులు (దంతరోగాలు కూడా), ఇష్టం లేని ప్రదేశాలకి వృత్తిపరమైన మార్పులు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల వూహించని పరిణామాలు, మనసు అంతా వెలితి… ఏదో పోగొట్టుకు న్న భావన. అంతా వున్నా… అందరి మధ్యవున్న, మంచి హోదా ఉన్నా తెలీని ఆందోళన, అసంతృప్తి, వేదన! ఇలా ఎన్నిటికో శని దేవుడు కార ణుడు.
*మరి ఆ శనిని సంతృప్తి పరచటానికి రెమిడీలు అవసరం! ఆ స్థానం బాగుండనపుడు కనీసం ‘గురు’ బలం అయినా అత్యవసరం. రెండూ బాగోకపోతే ఇబ్బందులు మెండు. అయితే గోచారరీత్యా రెండు గ్రహాలకి పరిహారం అవసరం.*
దీని వలన ఇబ్బందులు అధికమయితే… పరిహారాలు
శని వల్ల ‘నీలం’ ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు. ‘నీలం’ శని దేవుని రత్నమే అయినా అది శని దశలలో, శని నక్షత్రాలలో పుట్టిన, శని రాశులలో పుట్టినా, శని (గోచారరీత్యా) అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దశలు నడుస్తున్నా పెట్టుకోటం సరికాదు. పూర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.
నల్ల ఆవుకు బెల్లంతో కలిపిన నువ్వుండలు తినిపించాలి.
శనివారం, శని త్రయోదశి, మాసశివరాత్రి, మొదలైన రోజులలో (నవగ్రహాలలో వున్న) శనిదేవుని తైలాభిషేకం అత్యంత మేలు, శివునికి రుద్రాభిషేకం కూడా చేయాలి.ప్రతి శనివారం దేవాలయ సందర్శన చాలా మేలు (నవగ్రహ దేవాల యాలు).నూనె, నువ్వులు, మినుములు, నల్లమేక, ఇనుము మొదలైనవి దానం ఇవ్వచ్చు.ప్రతి శని త్రయోదశికి క్రమం తప్పకుండా శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు.ఆ సమయంలో ప్రత్యక్ష దైవం సూర్యనారాయణునికి నమస్కారములు చాలా మేలు.శని ‘కారకత్వాలుగా’ ఆయుష్షు, సేవకా వృత్తి, వాత వ్యాధులు, పాదు కలు, చెడు సహవాసము, సేవలు చేయటం, నపుంసకత్వం, కూలీ, అరణ్యసంచారం, నీలం, మినుములు, అబద్ధం, దున్నపోతు, పాపం, ఎండిపోవడం, దంతబాధలు, మోకాళ్ళు, కఫవాతం, ఎముకలు, దుఃఖం, శిల్పం, వ్యసనం, ఇంకా చాలా చాలా వున్నాయి.
*ఏల్నాటి శని దోష నివారణకు శని వినుకొండ పట్టణంలో సతీసమేతంగా నిర్మాణమౌతున్న శ్రీ శనైశ్చరాలయానికి ఇనుమును అందించడం ద్వారా శీఘ్ర ఉపశమనం పొందవచ్చని శాశ్విత శనిదోష నివారణ దేవాలయ ప్రతిష్ఠ సమయానికి కలుగుతుందని..పితృదేవతలు సంతృప్తి చెందుతారని ఎంతోమంది దేవాలయ ఆగమ సిద్దాంతలు తెలియచేసారు.*
*శనిస్తోత్రం*
నమస్తే కోణ సంస్థాయ పింగల్యాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌరయేవిభో
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ
ఇది ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమశని, జాతకరీత్యా శని దశలు, అంతర్దశలు నడిచే వారు ప్రతి రోజు వీలైనన్ని సార్లు పఠిస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. గ్రహబాధ తొలగి మనశ్శాంతి తప్పక లభిస్తుంది.
*👉ఇతర నామాలు:*
*ఇతనికి మందగమనుడు అని కూడా పేరు.*
*శనేశ్వరుడు, శనైశ్చరుడు, కాలుడు, మంద్యకోణ, సూర్యపుత్ర, యమ, సౌరి, ఛాయసుత, పంగు…*
*శనయే క్రమతి స: అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది.*
శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.
*ధర్మ రక్షకుడు*
*సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.*
*👉గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి,అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.*
*నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.*
శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .
*శని మహత్యం*
*బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.*
*శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే*
అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి.
*వినుకొండలో (గుంటూరు జిల్లా )ఉత్తర ఈశాన్య దిక్కుకు 90॰ కొలువుండబోతున్న శనీశ్వరాలయం నిర్మాణమునకు సహకరించండి. అఖండ సిరి సంపదలు ప్రాప్తిస్తాయి అని ఆగమశాస్త్ర వచనం*
విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ ‘ఓం నమో నారాయణాయ’, ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..’ అని జపించాలి.
హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలంఅంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, “న్నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు” అని దీవించాడట.
శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్ఠమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.
బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.
నల్ల గోవు(కపిల గోవు)కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.
శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి.
*కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి.*
*వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.*
*నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.శని క్షేత్రాలు సందర్శించాలి*
*ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.*
*దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.*
*శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.*
మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది.
శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది.
శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి.
‘రామ నామం’, హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం.
హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.
*పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.*
అనాథ బాలలకు అన్నదానం చేయాలి.
పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.
శనివారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ‘ఏడు’ శనికి ప్రీతికరమయిన సంఖ్య.
అని ప్రతి శనివారం శని భగవానుడిని ప్రార్థిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శనిభగవానుడు స్తోత్రప్రియుడు, కరుణామయుడు కావున… శనీశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజించిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి.
అంతేగాకుండా.. *“శని”* భగవానునికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున శనిత్రయోదశి రోజున ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాస, లఘున్యాస తైలాభిషేకం వంటి విశేష పూజలు చేయించే వారి గ్రహదోషాలు దరిచేరవని పురాణాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవస్థానంలో “శనిత్రయోదశి” పర్వదినాన విశేష పూజలు చేయించేవారికి ఈతిబాధలు తొలగిపోయి… పునీతులౌతారని పండితులు పేర్కొంటున్నారు..
*🙏శని శాంతి మంత్రాలు*
ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది.
*నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడుఅతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు.* ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
*నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది.*
శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ”క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
*శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్* *శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే*
*👉శనికి సమర్పించవలసిన ద్రవ్యాలేమిటి ?*
నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు
నాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్పించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.
కృష్ణ స్వరూపుడు నీలవర్ణుడు, నిప్పు తునకతో సమానుడు నల్లని ఇప్పపూవువంటివాడైన శనీశ్వరునికి మనస్కారం. త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా, సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి, సూర్యు భగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, వైశాఖమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి.
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్టనష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు. శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి సోదరుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు. ఆంధ్రప్రదేశ్ లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్, తమిళనాడులో తిరునళ్ళార్ శని క్షేత్రములు.
*అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్ లో వుంది. శని ప్రభావం వల్ల నల మహారాజు వస్త్రాలను పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి. భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంతమాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం.*
*ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి, మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా వుంటాడు.* శంగణాపూర్, మందవల్లి, నర్సింగ్ ల్ , విజయవాడ, జాల్నా, పాపగడ్, వైదీశ్వరన్ కోయిల్లలోని దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో మండవల్లిలోని శ్రీమందేశ్వర స్వామివారికి శని దోష పరిహారార్ధం తైలాభిషేకాలు చేసుకుంటే శని దేవుని వలన కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది.
Monday, 7 December 2020
🙏కాలభైరవ జయంతి విశిష్టత🙏
*ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం*
ముఖ్యంగా కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు.
సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది.
కాలభైరవుని విశిష్టత అనేది ప్రస్తుత రోజుల్లో తెలియదు.
కానీ సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆయనను పూజించినచో కాలమును మార్చ లేకపోయినా మనకు అనుకూలంగా మలచుకోవచ్చు.
ముఖ్యంగా
అసితాంగ భైరవుడు....
రురు భైరవుడు...
చండ భైరవుడు ...
క్రోధ భైరవుడు...
ఉన్మత్త భైరవుడు ...
కపాల భైరవుడు ....
భీషణ భైరవుడు ...
సంహార భైరవుడు...
అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.
*కాలభైరవ వృత్తాంతం*
పరమశివుడిని అవమాన పరచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.
క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు.
అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుందని చెప్పాడు.
తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.
శ్రీ కాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే
సకల గ్రహదోషాలు... అపమృత్యు దోషాలు... తొలగిపోతాయని , ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.
దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.
*తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |*
*భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||*
*పూజా విధానం:*
శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు.
కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది.
శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని , చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు.
శనివారం ,
మంగళవారాలు
కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు.
పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి.
కాలభైరవ పూజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది.
శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.
పూజను చేయలేనివారు
*శ్రీ కాలభైరవాష్టకం , భైరవ కవచం , స్తోత్రాలు* పఠించడంవల్ల భైరవానుగ్రహాన్నీ పొందవచ్చు.
*కాలభైరవాష్టకం*
*దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |*
*నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||*
*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*
*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||*
*శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*
*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||*
*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |*
*నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||*
*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*
*స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||*
*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |*
*మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||*
*అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |*
*అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||*
*భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |*
*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||*
*కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |*
*శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||*
*కాలభైరవ అష్టమి – భైరవ పూజ ఫలితాలు*
సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూప.
కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక ఈయనను కాలభైరవుడు అని అంటారు.
నుదుటున విభూతి రేఖలను ధరించి ,
నాగు పాముని మొలత్రాడుగా చుట్టుకుని…
గద ,
త్రిశూలం ,
సర్పం ,
పాత్ర చేత బట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం.
ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.
శ్రీ కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిశేకము చేయించి ,
గారెలతో మాల వేసి…
కొబ్బరి , బెల్లం నైవేద్యంగా పెట్టినచో
జాతకంలో వున్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్షు పెరుగును.
Friday, 4 December 2020
పనసకోన లో శివాలయలు
పనసకోన శ్రీకాళహస్తి కి 4 కి.మీ దూరంలో నెలకొంది, అతి పురాతనమైన ఈ గుహలో పురాతన శివాలయం ఉంది.
ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు ఎంతో రమ్యంగా ఉంటాయి, ఈ గుహలో నెలకొన్న శివాలయం కూడా అంతే మనోహరంగా, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది.పెద్దగా భక్తుల రద్దీ లేనందున , ఈ దేవాలయం ఆధ్యాత్మిక మరియు ప్రశాంతతను కలుగజేస్తుంది.
ఒక శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయము, శివలింగము మనకు అక్కడ దర్శనము ఇస్తాయి.పచ్చని ప్రకృతి , ఎన్నో తరాలను చూసిన ఈ గుహలు, దేవాలయం అన్నీ కలిసి ఈ పనసకోన ఒక అద్భుత స్థలము, ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన ప్రదేశము..!
సేకరణ : ముత్యాల మురళి కృష్ణ
Wednesday, 2 December 2020
ఎవరు ఏ లింగాలని పూజించాలి, వాటి ఫలితం,ఏ మాసంలో ఏ లింగాన్ని .
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి. స్పటిక లింగాన్నిమాత్రంఎవరైనా అర్చించవచ్చు. స్త్రి విషయానికి వస్తే, భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాన్ని, భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్నికానీ రసలింగాన్ని కాని అర్చిస్తే మంచిదని లింగపురాణం చెబుతోంది. స్త్రి లలో అన్ని వయస్సుల వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చుఏలింగాన్ని పూజచేస్తే ఏం ఫలితం?ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగపురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦, వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది. అన్నిటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహ లింగంఅతి పవిత్ర బాణలింగంఅన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి. రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగావెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చుస్థాపర, జంగమ లింగాలు :జగత్తంతా శివమయం, అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరూపమైనప్పుడు, సృష్టి స్థితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు, చెట్లు ( మొదలైనవి) జంగమాలు(కదిలేవి-మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి)కూడా లింగరూపాలే అవుతాయి. వీటికి స్తావరలింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా శివపుజలోకే వస్తుందిలింగ పూజ చేసేవారు ఉత్తరముఖంగా కూర్చోవాలని, రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.
Subscribe to:
Posts (Atom)