Saturday, 29 August 2020

ఏడుకొండలవాడా వెంకటరమణా..గోవిందా..గోవిందా అంటూ..


అ స్వామిని చూడటానికి ఎంతో ఆత్రుతగా వెళితే, ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది. 
అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు, ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు.సమయం సరిపోదు. 

ఆ ఆపదమొక్కుల వాడిని, 
అనాధరక్షకుడిని చూస్తుంటే… 
కళ్ళనిండా ఆనంద బాష్పాలతో 
మనసు పొంగిపోతుంది. 
అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసుందాం.

*1.శిఖామణి:*
శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.

*2.సాలిగ్రామాలు:*
ఇవి రెండు మాలలు. 
ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. 
శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు.

*3.కంఠసరి:*
ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది. 
మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి.

*4.వక్ష స్థల లక్ష్మి:*
ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది. 
శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు.

*5.శంఖుచక్రం:*
శంఖుచక్రాలకు రెండు దండలు. 
ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.

*6.కఠారి సరం:*
శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు.

*7.తావళములు:*
రెండు మోచేతుల కింద, 
నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, 
మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ 
వేలాడ దీసే మూడు దండలు ఒకటి 
మూడు మూరలు ఉంటుంది. 
రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.

*8.తిరువడి దండలు:*
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది.

ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, 
పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు.

 శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?

ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో మరియు బస్సులలో వెళుతుంటారు. చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. కానీ ఎంతమందికి తెలుసు అలిపిరి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయని ??

అలిపిరి - తిరుమల మెట్ల మార్గం !!

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ? ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్గాల గురించే తెలుసుకుంటున్నాం ఇక్కడ.

మీకు తాళ్ళపాక అన్నమాచార్యులు గురించి తెలుసు కదా ? ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో వెంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.

అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత్రమాత్రమే.

మొదటి మెట్టు

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.

అలిపిరి

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. దూరం 11- 12 KM లు ఉంటుంది.

రెండవ దారి

తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.
కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.

మూడవ దారి

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

*నాల్గవ దారి*

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

నాల్గవ దారి

డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 KM.

*ఐదవ దారి*

కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 KM.

ఆరవ దారి

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

ఏనుగుల దారి

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

*తలకోన*

తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద మెట్లు నిర్మించారు. విజయనగర రాజులు అలిపిరి - గాలి గోపురం మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.

గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..

అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.

ఆంజనేయస్వామి

గాలిగోపురం లోపలి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి, అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

మోకాళ్ళ మిట్ట

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

శ్రీవారి మెట్టు

శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

శ్రీవారి మెట్టు

తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.

శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తుంటారు. వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేసుకుంటే చెల్లుతాయి. 1100 మెట్ల వద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి.

మెట్ల దారిన వెళ్తున్నప్పుడు గుర్తించుకోవాల్సినవి

1. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఉచితబస్సు సౌకర్యం ఉంది. 

2. శ్రీవారి మెట్టు కు వెళ్ళే మార్గంలోనే అలిపిరి వస్తుంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద ఆ సౌకర్యం లేదు.

3.మెట్లమార్గం లో తాగునీటి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కనుక బాటిల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలను తీసుకొని పోవచ్చు. కొండపైన, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధo.

వసతి ససౌకర్యాలకు తిరుమల లో కొదువలేదు. ఉత్సవాలు, పండుగలు తప్పనిచ్చి మిగితా అన్ని దినాలలో బస దొరుకుతుంది. టిటిడి విశ్రాంతి గదులు, గెస్ట్ హౌస్ లు, సత్రాలు, లాంటి ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి. 
ఈసారి తిరుమలకు  పైన పేర్కొన్న దారుల గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి.

Monday, 24 August 2020

ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ - చికిత్సలు .



  సకల చరాచర సృష్టిలో సర్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.

               సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు  రకాలుగా ఉన్నాయి.       అవి 

 1 .  దివ్యములు ఇవి దేవతా సర్పములు .

 2 .  భౌమములు  ఇవి భూమి నందు ఉండునవి .

   దివ్యసర్పములు లలో భూమి యందు తిరిగే 
సర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.

  దివ్య సర్పములలో రకాలు  - 

   1 .  అనంతుడు.

    2 .  వాసుకి.

    3 .  తక్షకుడు.

    4 .  కర్కోటకుడు .

    5 .  పద్ముడు .

    6 .  మహాపద్ముడు .

    7 .   శంఖపాలుడు .

    8 .   కులికుడు . 

  దేవతాసర్పములకు ఉండు గుర్తులు  - 

      అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును.  కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల 
వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును. 

             పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.

  దేవసర్పములకు విషము ఎక్కువ ఉండు సమయములు  - 

      ఆది, సోమ , మంగళ, బుధ , గురు, శుక్ర , శని వారాల్లో పగలు సమయంలో దేవతా సర్పములకు విషం ఎక్కువ ఉండును. రాత్రి సమయంలో విషప్రభావం చాలా తక్కువ ఉండును. ఒక్క శనివారం రాత్రి సమయంలో మాత్రం విషప్రభావం ఎక్కువ ఉండును. ఈ సమయంలో మాత్రమే అనంతుడు వంటి దేవతా సర్పాలు కరుచును . 

  దేవతాసర్పముల యొక్క మహిమ  - 

      అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరామరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషదం ఏమి లేదు . 

  భూమి యందు ఉండు సర్పముల భేదములు 
 

   1 - ఉపజాతి సర్పములు .

   2 -  దర్వీకరములు .

   3 -  మండలీ సర్పములు . 

   4 -  రాజీమంతములు .

           అను నాలుగు రకముల సర్పములు కలవు.

  భౌమ సర్పముల యొక్క లక్షణములు - 

    
       పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును 

     ఉపజాతి సర్ప లక్షణములను విష లక్షణములను తరువాత వివరిస్తాను.

  మూడు రకాల సర్పాల విష గుణము  - 

      దర్వీకముల యొక్క విషము కొంచం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. మండలీ విషము వేడిగా ఉండి పులుపు రుచి కలిగి ఉండును. రాజీమంత విషము చల్లగా ఉండి మధురముగా ఉండును. 

          పైన చెప్పిన రుచులను బట్టి ఆయా సర్పాలు కరిచినప్పుడు వాటి విషం శరీరం లో ప్రవేశించి వాతాదిదోషములను కలుగచేయును  . 

  మూడు రకాల సర్పములు యొక్క వాతదోషముల వివరములు  - 

 
      దర్వీకర జాతి సర్పములు  వాతోద్రేకం , మండలీ సర్పములు పిత్తోద్రేకం , రాజీమంత సర్పములు శ్లేష్మోద్రేకం కలిగి ఉంటాయి. 

  భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య  - 

 1 -  దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు. 

 2 -  మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు. 

 3  - రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.

 భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి , ప్రమాదకరమైనవి త్రాచుపాములు ఇవి మొత్తం 14 రకాలు .  అవి 

   *  చింతపువ్వు వన్నె త్రాచు.

   *  నాగజెర్రి .

   *  రేలత్రాచు .

   *  నాగజెర్రి.

   *  సెనగపువ్వు త్రాచు.

   *  నల్లత్రాచు.

   *  అరికెవన్నె త్రాచు.

   *  కందిపొడల త్రాచు.

   *  మొగలిపువ్వు త్రాచు.

   *  తెల్ల త్రాచు.

   *  కోడె త్రాచు.

   *  గిరినాగు .

   *  నీరు త్రాచు .

   *  గోధుమ త్రాచు.

   *  రాచపాము 

          ఈ విధంగా 14 రకాలుగా త్రాచుపాములు ఈ భూమి యందు నివసించుచున్నాయి.

   ఇప్పుడు వీటి లక్షణాలు తెలియచేస్తాను .

 *  చింతపువ్వు వన్నె త్రాచు  - 

          దీని యొక్క శరీరం మంచి ఛాయతో ఉండి దీని యొక్క కోపం సాధారణంగా ఉండును. ఆదివారం నాడు దీని యొక్క విషతీవ్రత తీవ్రంగా ఉంటుంది.

 *  నాగజెర్రి  - 

           ఇది సగం త్రాచు వలే , సగం జెర్రిపోతు వలే ఉండును. చెట్లు , తోటల యందు , చెట్ల పై భాగంలో నివసించుతూ గోధుమవన్నే తెలుపురంగు కలిగి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అత్యంత కోపం . సోమవారం నాడు విషాదిక్యత కలిగి ఉండును. నాగజెర్రిని త్రాచుపాముల జాబితాలోనే మన పూర్వికులు చేర్చారు .

 *  రేలత్రాచు  - 

            అడవుల యందు నివసించుట, సన్నంగా, పొడవుగా శరీరం కలిగి ఉంటుంది. సామాన్యమైన కోపం కలిగి ఉంటుంది.సోమవారం నందు దీనియొక్క విష తీవ్రత అధికంగా ఉంటుంది. 

 *  శెనగపువ్వు త్రాచు  - 

             ఇది శెనగ పువ్వు వర్ణం కలిగి ఉంటుంది. సువాసన గల ప్రదేశాలలో ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విషప్రభావం అధికంగా కలిగి ఉంటుంది.

 *  నల్లత్రాచు  - 

             నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం , అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్చంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది.

 *  అరికెవన్నె త్రాచు  - 

             ఈ త్రాచు ఎక్కువుగా మనుష్యుల మల విసర్జణ చేసే ప్రదేశాలలో సంచారం చేయును . మలభక్షణం చేయును . అత్యధిక కోపం , స్వచ్చమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది.

 *  కందిపొడల త్రాచు  - 

            కందికాయ మీద ఉండునట్టి పొడలు వలే దీని శరీరం పైన ఉంటాయి. సామాన్యం అగు కోపం కలిగి ఉంటుంది.బుధవారం నందు దీని విషతీవ్రత అధికంగా ఉండును. 

 *  మొగలిపూత్రాచు - 

             దీనియొక్క శరీరం వెండితో సమానం అయిన ఛాయ ఉంటుంది.పరిమళములు గుభాళించు ప్రదేశాలలో ఉంటుంది. మొగలి పొదలు , పరిమళ ఔషదాలు గల అరణ్యముల 
యందు సంచరిస్తుంది. కోపం తక్కువ, అతిశాంతం , సూక్ష్మమైన మొగలి రేకు ప్రమాణం ,  గురవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును. 

 *  తెల్లత్రాచు  - 

              కోపం తక్కువ , సాత్విక గుణం , శాంతస్వభావం , వెన్నెలవంటి శరీర రంగు కలిగి ఉండి తెల్లత్రాచు అని చెప్పబడును .

 *  కోడెత్రాచు  - 

              18 అంగుళముల పొడువు ఉండును. కోళ్ళని భ్రమ చెందించి ఆకర్షించుట కొరకు కోళ్ళవలె అరుచును. ఇండ్ల యందు , కోళ్ల గూళ్ళ యందు నివాసం ఉండును. అత్యధిక కోపం కలిగి ఉండును. రాత్రుల యందు కోళ్ళని భక్షించును. రూపం భయంకరంగా ఉండును. అత్యంత చురుకుగా ఉండును. శుక్రవారం నందు అత్యథిక విషతీవ్రత కలిగి ఉండును.

 *  గిరినాగు  - 

           చంద్రబింబం వంటి వంక కలిగి , మెరుస్తున్న పడగ కలిగి ఉండి పర్వతముల యందు సంచారం చేస్తూ చెట్ల కొమ్మల యందు నివాసం ఉండును. ఇది పక్షులను భక్షించును . పడగ యందు వర్తులాకారం గా కృష్ణపాదములు కలిగి ఉండును. శుక్రవారం నందు విషోద్రేకం కలిగి ఉండును. 

 *  నీరుత్రాచు  - 

          అధికం అగు విషం , అతికోపం కలిగి ఉండి జలం నందు సంచారం , జలజంతు భక్షణ చేయుచూ శుక్రవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.

 *  గోధుమత్రాచు  - 

         సాత్విక స్వభావం కలిగి ఉండి గజము పొడవు ఉంటుంది. శనివారం నందు విషోద్రేకం కలిగి ఉండును.

 *  రాచనాగు అను త్రాచు  - 

          పడగ గుండ్రంగా ఉండి , కృష్ణపాదములు లేని పడగ ఉండి మూడు అడుగుల పొడవు కలిగి ఉండి అధికకోపం కలిగి ఉంటుంది. చాలా భయంకర స్వభావం కలిగి ఉంటుంది. పగదీర్చుకొను పట్టుదల ఉండును. పర్వతాలు అరణ్యముల యందు నివాసము ఉండును.

          ఇప్పుడు మీకు పెంజర పాముల గురించి వివరిస్తాను.

 ఇవి మొత్తం 21 రకాలు  అవి .

 *  కాటుకపోడ పెంజర .

 *  రక్త పెంజర .

 *  ఉడుముపొడ పెంజర.

 *  కలంకారీ పెంజర.

 *  పొట్ల పెంజర.

 *  తివాసిపోడ పెంజర.

 *  ఊదుపొడ పెంజర .

 *  పిచ్చుకపోడ  పెంజర.

 *  అగ్నిపోడ  పెంజర.

 *  పొడ పెంజర.

 *  సున్నపుపొడ పెంజర.

 *  తేనెపొడ పెంజర.

 *  కుళ్ళుపొడ పెంజర.

 *  పాదిరీపొడ పెంజర.

 *  గువ్వపొడ పెంజర.

 *  గరికపోడ పెంజర.

 *  మోదుగపూపొడ పెంజర.

 *  పసుపుపొడ పెంజర.

 *  దొండపండు పొడ పెంజర.

 *  గవ్వపోడ  పెంజర.

 *  రెండు తలల శిఖండి.

           పైన చెప్పిన విధంగా 21 రకాలుగా ఉన్నాయి . 

  మండలీ సర్పముల లక్షణములు  - 

 *  కాటుకపోడ పెంజర లక్షణము  - 

       ఈ పెంజర మిక్కిలి లావుగా , అమితమైన పొడవు , శరీరం అందు పంగనామాలు  కలిగి ఉండును. ఇది జీవజంతువులను కరుచును. దీని కాటు వలన దేహమంతయు వాపు , తెల్లగా పాలిపోవడం , దురద, నిస్సత్తువ కలుగును. మరణం మాత్రం కలుగదు . దీనిని దాసరిపాము అని కూడా పిలుస్తారు . 

 *  రక్త పెంజర  - 

       రక్త పెంజర అనునది చెయ్యి పొడవు కలిగి ఉండి ఎర్రని మచ్చలు , భయంకరమైన విషం కలిగి ఉండును. దీని కాటు వలన మైకం , భ్రాంతి, మూర్చ, నోటివెంట నురుగు పడును. నేత్రములు , పండ్ల చిగుళ్లు , రోమకూపములు , ముక్కు , కంఠం వీటి నుండి విపరీతంగా రక్తస్రావం కలుగును.ఎనిమిది జాములలో మనిషి మరణించుట జరుగును. ఆ సమయం దాటిందో చిత్రంగా బతుకగలడు.

 *  ఉడుముపొడ పెంజర -

        ఈ పెంజర పెద్ద శిరస్సు కలిగి ఉండి గరుకు శరీరం , ఉడుము వంటి ఆకారం కలిగి భయంకరంగా ఉండును. దీని కాటు వలన కలిగిన గాయము నుండి అధికంగా రక్తం స్రవించును . మైకంలో  ఉండి మంత్ర మరియు ఔషధ చికిత్సలకు లొంగక 3 దినములలో తప్పక మనిషికి మరణము కలుగును.

 *  కలంకారీ పెంజర  - 

        కలంకారీ పెంజర అనునది మూరెడు పొడవు కలిగి ఉండి కలంకారీ రంగుల వంటి పొడలు కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం మంటలు పుట్టును . శోఫ , కలంకారి పని చేయబడిన చాందిని వంటి మచ్చలు , కంఠం యందు శోఫ , దాహము కలుగును. కాటుపడిన చోట ఆముదం , నూనె మొదలయిన చమురు పదార్థాలను ఉంచిన అవి ఇనికిపోవును . ఇట్టి లక్షణాలు కలిగిన మనిషి ఒక్క రోజులో మరణించును.

 *  పొట్ల పెంజర  - 

        పొట్ల పెంజర అనునది తలయును , తోకయును సన్నంగాను , శరీరం లావుగాను , పొట్లకాయ రంగు కలిగి మూరెడు పొడవు కలదై పొట్లకాయ వలే ఉండును. దీని కాటు తిన్నవారికి గొంతుక యందు గురక కలుగుట , శరీరం వాచుట మొదలగు లక్షణాలు కలుగును. దీని కాటు తినినవాడు 4 వ దినం నందు తప్పక మరణించును.

 *  తివాసిపోడ పెంజర  - 

        ఈ పెంజర అనునది 20 అంగుళాల పొడవు ఉండి తివాసి రంగుల వంటి మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడిన వారి శరీరం అంతా మంటలు , వాపు , మైకం , కనులకు చీకటి కమ్మడం వంటి లక్షణాలు కలిగి నాలుగు జాములలో మరణం సంభంవించును.

 *  ఊదు పొడ పెంజర - 

         ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు . నరులు మొదలయిన వాని శరీరం నందు బుస్సుమని వూదును. అందువలన దేహమందు వాపు , రక్తక్షీణత , పాండు రోగం , నిస్సత్తువ , కీళ్ల యందు చచ్చుదనం వంటి దుర్గుణములు ఏర్పడి చాలా కాలం తరువాత మరణం కలుగును.

 *  పిచ్చుకపోడ పెంజర  - 

          ఈ పెంజర అనునది అడుగు పొడవు ఉండి ముఖం నందు మూడు మచ్చలు ను కలిగి ఉండును. ఇది ఇండ్ల చూరుల యందు ఉండును. ఇది ప్రాకును. మరియు దుముకుతూ వేగంగా పోవును . దీనికాటు పడిన వారికి దేహం నందు పిచ్చుక మచ్చలు వంటివి మచ్చలు కలుగును. కడుపులో తిప్పును. రొమ్మునందు పసరు చేరినట్టు ఉండును. దీనివలన మరణం కలగదు .

 *  అగ్నిపోడ పెంజర  - 

          అగ్నిపోడ పెంజర  అనునది  18 అంగుళాల పొడవు కలిగి ఉండును. ఇది మనుషుల శరీరం నందు కాటువేయుట , ఊదుట , చొల్లు కార్చుట చేయును . ఈ మూడింటిలో ఏ విధంగానైనా అగ్నిపోడ పెంజర విషాన్ని మనుష్యుని  మీదకు విషాన్ని ప్రయోగించిన శరీరం నందు మిక్కిలి మంటలు కలుగును. కొంతకాలం తరువాత చిన్నగా అనారోగ్యం కలుగును. మరణం లేదు .

 *  పొడపెంజర  - 

          ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు. ఊదును. దీని నోటి విషపు గాలి తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా భగ్గున మంట మొదలగును. గాలిసోకిన స్థలం నందు రెండు మూడు దినముల పిమ్మట నిప్పుతో కాల్చబడినట్టు బొబ్బలు జనించును. నూనె మొదలగు సేవించినట్టైన  శరీరం నందు నల్లని మచ్చలు పుట్టును . కొంతకాలం ఇలా బాధపడిన తరువాత మృత్యువు సంభంవించును.

 *  సున్నపు పొడ పెంజర  - 

           ఇది అడుగు పొడవు మాత్రమే ఉండును. ఇది వరిమళ్ళ లోని ఎండ్రకాయ బొక్కలలో నివసిస్తూ ఎండ్రకాయలను భక్షించును . ఇది కరవదు. ఇది మనుజుల శరీరం నందు ఊదును. దీని విషపు గాలి తగిలిన వెంటనే మంట పుట్టును . శరీరం నందు మచ్చలు , దద్దుర్లు , గ్రంథులు ఏర్పడి , దురద మొదలయి కుష్టురోగి వలే ఉండును.  దీనివల్ల మృతి కలగదు . 

 *  తేనె పొడ పెంజర  - 

          ఇది రెండు మూరల పొడవు కలిగి ఉండి గుర్రపు వన్నె గల మచ్చలు కలిగి ఉండును. ఇది కరిచిన శరీరం నందు వాపు , మచ్చలు జనియించి కొన్నిదినములకు మృతి చెందును 

 *  కుళ్లు పొడ పెంజర  - 

           ఇది ఒక గజం పొడవు ఉండును. దీని శరీరం పైన అనేక వర్ణములు గల పొడలును కలిగి ఉండి చూచుటకు అసహ్యం కలిగి ఉండును. దీని కాటు పడిన వారికి శరీరం బరువు ఎక్కును. ముక్కులు ఎగురుచుండును. శ్వాస బంధించును. కాళ్లు , చేతుల యెక్క గోళ్లు పుచ్చిపోవును . కుష్టువ్యాధి సంభవించినట్టు శరీరం కుళ్ళి దుర్గందం ఏర్పడును . ఇది కరిచిన సంవత్సరం తరువాత మరణించును.

 *  పాదిరీ పొడ పెంజర  - 

           ఇది చేతి పొడవు ఉండును. కలిగొట్టు పువ్వు వన్నె మచ్చలు కలిగి ఉండి మొద్దు స్వభావం కలిగి ఉండును. ఇది కరవదు. మనుజుల శరీరములను నాకును. అందువలన శరీరం నందు పైత్యం , నవ, శరీరం రంగు    మారు ట , నిస్సత్తువ, వాంతులు ఎక్కిళ్లు , అరిచి సంభంవించును. మృతి ఎంత మాత్రం కలగదు . 

 *  గువ్వపోడ పెంజర  - 

           ఇది ముప్పది అంగుళముల పొడవును , పావురపు రంగు శరీరం కలిగి ఉండి పసుపు వన్నె మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడినవారికి శరీరం నందు పాండు వ్యాధి , దురద, శోఫ , పసుపు వర్ణము గల మచ్చలు , దద్దురులు కలుగును. కొంతమందికి మాత్రమే మరణం కలుగును.

 *   గరికపోడ పెంజర  - 

            ఇది గరిక వర్ణపు మచ్చలను కలిగి ఉండి అడుగు పొడవును కలిగి ఉండును. దీని కాటు వలన మనుజులకు శరీరం నందు దురద, వాపు , మాంద్యం, నొప్పి, కన్నులు భ్రమ గప్పుట, దేహంలో నిస్సత్తువ , శరీరం అంతా ఆకు పసుపు వర్ణం గల పొడలు , శరీరం నందు వణుకు వంటి లక్షణాలు కలిగి కుష్టువ్యాది జనింపజేయును . కాళ్ల యొక్క చేతుల యొక్క వ్రేళ్లు వంకరలై ఎండిపోయినట్టు అయ్యి శుష్కించి ఉండును.

 *  మోదుగుపూ పొడ పెంజర  - 

           ఇది రెండు అడుగుల పొడవు , ఎర్రని మచ్చలు కలిగి ఉండును. దీని కాటు తిన్న వారికి శరీరం నందు వాపు , గాయం నందు పోట్లు , శరీరం నందు గ్రంథులు కట్టుట, అప్పటికప్పుడే రక్తం వాంతి అగుట , దగ్గిన రక్తం పడుట వంటి లక్షణాలు కలిగి ఉండును.

 *  పసుపుపొడ పెంజర  - 

           ఇది చేతి పొడవు కలిగి ఉండును. పసుపు వన్నె మచ్చలను కలిగి యుండును. దీని కాటు వలన శరీరం నందు పసుపు రంగు బొబ్బలు , జ్వరం , గాయాల్లో పోట్లు ఏర్పడి మరణం సంభంవించును.

 *  దొండపండు పొడ పెంజర  - 

          ఇది చేతేడు పొడవు ఉండును. చక్కగా పండిన దొండపండు వర్ణం కలిగి ఉండును. దీని కాటువలన శరీరం నందు నరములు ఉబ్బి ఎర్రగా కనిపించును. దేహం శుష్కించును . గాయం నందు పోట్లు కలుగును. మారుతి సంభవింపదు.

 *  గవ్వపోడ పెంజర  - 

          ఇది మూడు మూరల పొడవును , లావుగా భయంకరంగా గవ్వ  వర్ణం కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం నందు పాండువు , ముఖం , నేత్రములు పసుపు వర్ణం కలిగి ఉండును. కాటుపడిన ప్రదేశం కుంగి గుంట పడుట జరుగును. మరణం సంభవించదు.

 *  రెండు తలల శిఖండి  -  

         ఈ పెంజర రాగిరంగు కలిగి ఉండును. తెల్లని మచ్చలు , గజము పొడవు కలిగి ఉండును. దీని తోక వైపు మొద్దుగా ఉండటం చేతను తలవైపుకు ప్రాకినట్లే తోకవైపుకు పాకును. అందువలన జనులు దీనికి రెండు తలలు ఉండునని భావించును. దీనిని కర్రతో కొట్టినా చావదు. జెముడు , జిల్లేడు కర్రలతో కొట్టినను , నిప్పులతో కాల్చినను చనిపోవును . ఇది కరవదు . మనుజుల శరీరం నాకును . ఇందువలన దేహం అంతయు నవ, పాండు రోగం , పొడలు , వాపు కలిగి అన్నం తినటం మీద ద్వేషం కలుగును. 
 
   ఇప్పటివరకు  మీకు 21 రకాల పెంజర సర్పాల గురించి తెలియచేశాను . ఇప్పుడు మీకు రాజీమంత సర్పాల గురించి తెలియచేస్తాను .  

     ఈ రాజీమంత సర్పాలలో 4 రకాల సర్పాలు కలవు.       అవి 

  *  క్షుద్రజాతి సర్పాలు . 

   *  కుంభీ వస సర్పాలు .

   *  మహా సర్పాలు .

   *  నిర్విష సర్పాలు .   అని 4 రకాలు కలవు.

  రాజీమంత సర్పాలలో బేధాలు  - 

     పైన చెప్పబడిన నాలుగు జాతుల సర్పాలలో క్షుద్రజాతి సర్పములు 9 జాతులుగాను , కుంభీవస సర్పాలు 8 కులములుగాను , మహాసర్పములు 3 బేధములుగాను , నిర్విష సర్పములు 16 తరగతులుగా పుట్టి ఉన్నవి.

  క్షుద్రసర్పములలో రకాలు  - 

 *  పెద్ద కట్లపాము.

 *  నాగుల కట్లపాము.

 *  నూనె కట్లపాము.

 *  బఱ్ఱె కట్లపాము.

 *  కట్లపాము.

 *  తాటిబొలుగు పాము.

 *  చెట్టెగురు పాము.

 *  గొడ్డలి ముఖపు పాము.

 *  గోడప్రాకుడు పాము.    

         ఈ విధంగా మొత్తం 9 విధాలుగా ఉండును.

 *  పెద్ద కట్లపాము లేదా పెద్ద పరుగుడు పాము 

          ఇది గజము పొడవు ఉండి గోధుమవన్నె త్రాచు పాముని పోలి ఉంటుంది.  దీని కాటు పడిన వానికి మాటిమాటికి విషం ఎక్కి భాధించును. కాని మరణం కలగదు.

 *  నాగుల కట్లపాము  - 

           దీనిని నాగ పరుగుడు అని కూడా అంటారు. ఇది 36 అంగుళముల పొడవు ఉండును. ఇది చూడటానికి నల్ల త్రాచువలె ఉండును. దీని కాటువలన విషం ఎక్కడం దిగడం జరుగును. మంత్రౌషదాల వలన విషం విరుగును. మరణం కలగదు. 

 *  నూనె కట్లపాము  - 

            ఇది 36 అంగుళముల పొడవు కలిగి ఉండి శరీరం అంతయు తెల్లని కట్లు కలిగి ఉండి మెరుస్తూ ఉంటుంది. దీని విషం మిక్కిలి చురుకు అయినది. దీని కాటు వలన బాధ కలుగును. విషం వలన మరణం సంభవించదు.

 *  బర్రెకట్ల పాము  - 

            ఇది 50 అంగుళాల పొడవు ఉండి మొద్దు వలే లావును , శరీరం నందు గరుకు కలిగి ఉండును. ఇది క్రూరమైన విషం కలిగి ఉండును.

 *  కట్లపాము లక్షణము  - 

             ఇది మూడుమూరల పొడవు , శరీరం నందు గణుపుల వంటి కట్లు కలిగి ఉండును. ఇది కాటు వేయడం వలన మాటిమాటికి విషం ఎక్కడం , దిగడం జరుగును. మరణం కలుగనేరదు .

 *  తాడిగిరి లేదా తాటిబొలుగు పాము  - 

              ఇది  చిటికెన వ్రేలు లావును , మూడు జానల పొడవు నూనె రంగును కలిగి ఉండును. ఇది తీగ జాతి చెట్లలో విశేషంగా తాటిచెట్ల యందును సంచరించును. మనుజుల నిది తలమీదనే తప్ప మరి వేరే ప్రదేశంలో కరవదు. అందువలన తక్షణమే విషమెక్కి మనుజుడు గంటలోపునే చచ్చును. దీని విషముకు విరుగుడు లేదు . ఇది పగబట్టిన మనిషిని చంపియే తీరును . ఒకవేళ చంపలేక పోతే నిరసన వ్రతం బూని 6 నెలలలో అతనికోసం వేచి చూసి చివరకు చచ్చును. 

 *  చెట్టగురు పాము  - 

            ఇది చిటికెన వ్రేలు లావు , అడుగున్నర పొడవు ఉండి ఎప్పుడూ చెట్ల మీదనే ఉండును. ఇది ఒక చెట్టు పై నుంచి మరియొక చెట్టు పైకి తటాలున దుమక గలదు. ఇది మనుజులను తలమీద కాని కన్నుల మీద కాని కరుచును. ఇది పగ సాధించుట విషయంలో  తాడిగిరి పామును పోలి ఉండును. ఇది కరిచినచో ఔషదం ఇచ్చు సమయం కూడా ఉండదు. అంతలోపు మనుజుడు మరణించును. జీవజంతువులు ను చంపుటలో దీని విషాన్ని మించినది లేదు . కావున పర్వాతారణ్యాలు , ఉద్యానవనాలు యందు తిరిగే వారు ఈ సర్పాన్ని సదా కనిపెట్టి తిరగగలరు.

 *  గొడ్డలిమొగపు పాముల లక్షణము  - 

             ఇది ఉదారంగును , గొడ్డలి వంటి తల కలిగి ఉండును. రేగటి మట్టి భూములలో , చౌడు భూముల్లో , బురద నేలల్లో నివసించును. వర్షాకాలంలో మాత్రమే బయట తిరుగును. మూరెడు పొడవు కలిగి ఉండును. ఈ పాముచే కరవబడిన మనుజుడు యొక్క అంగాలు కుంచించుకు పోయి పొట్టివాడు అగును.

 *  గోడప్రాకుడు పాము లక్షణము  - 

              ఇది రెండు మూరల పొడవు కలిగి తెల్లని శరీరం కలిగి శరీరం పైన నల్లని అడ్డు చారలు కలిగి ఉండును. వేలెడు లావు కలిగి ఉండును. అతిక్రూరమైన విషము కలిగి ఉండును.ఈ సర్పము ఎంత చదరము అయిన గోడని అయినా ప్రాకి ఎక్కగలదు. కాని దిగుట తెలీదు . గబుక్కున కింద పడును. 
ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి వివరణ - 5 

        అంతకు ముందు పోస్టులో రాజీమంత సర్పాలు మొత్తం 21 రకాలు వాటి గురించి సంపూర్ణ వివరణ ఇచ్చాను. ఇప్పుడు కుంభీన జాతి సర్పాలు గురించి వివరిస్తాను. 

   ఈ కుంభీని జాతి సర్పాలు మొత్తం 8 రకాలు .

  *  ఘంటాపుచ్చము .

  *  గరున్నాగము .

  *  త్రిశూలి .

  *  జటాధరము .

  *  కుంభీనసము .

  *  శోణముఖము .

  *  లోహితాక్షము .

  *  ఛత్రపతి.

       ఈ విధంగా 8 రకాలుగా ఉంటాయి.

 *  ఘంటాపుచ్చ సర్ప లక్షణము  - 

         మిక్కిలి పొడవు శరీరం , క్రూరత్వం , మిక్కిలి పరాక్రమం సంచరించునప్పుడు తోక చివర యందు ఘంటానాదం కలిగి ఉంటుంది. ఈ సర్పం సర్వ జంతువులను భక్షించును . ఉగ్రమైన విషం కలిగి ఉండును. సంచారం బయలుదేరడం మొదలు కాగానే దీని తోక యందు ఘంటానాదం వినపడును. ఆ నాదం వినపడిన వెంటనే సమస్త జంతువులు పారిపోవును. ఈ సర్పం ఆఫ్రికా దేశ పర్వతారణ్యములలో సంచరించును.

 *  గరున్నాగ సర్ప లక్షణము  - 

         ఖడ్గము వంటి నాలుక , గబ్బిలపు రెక్కల వంటి రెక్కలు , గుడ్లగూబ వంటి ముఖం, భూమి మీద మరియు ఆకాశ గమనం , 8 మూరల పొడవు కలిగి ఉండును. ఇది పక్షిజాతులను భక్షించును . ఇది ఆఫ్రికా దేశ పర్వతారణ్యాలలో నివశించును.

 *  త్రిశూలీ సర్ప లక్షణము  - 

           పిల్లివంటి ముఖం , తోక యందు గరుడపచ్చ కాంతి వంటి రేఖలతో ప్రకాశించుట , మీసాలు కలిగి ఉండును. 16 మూరలు పొడవు కలిగి ఉండిన దేహము , తోక త్రిశూలం వంటి మూడు చీలికలు కలిగి ఉండును. ఇది ఆఫ్రికా ఖండం నందు ఉండును. 

 *  జటాధరా సర్ప లక్షణము  - 

           మేకవంటి స్వరము , అతి పెద్ద శరీరం , గొఱ్ఱెవలె జడలు , 6 మూరల పొడవు , కంబడి చాయ వంటి లక్షణములు కలది. ఇది సింహళ ద్వీపం నందు ఉండును.

 *  కుంభీనస సర్ప లక్షణము  - 

           మూడు మూరల పొడవు , పంది ముఖం , కడవ వంటి కడుపు , కురచ అయిన తోక , చిన్నగా పాకును .  తుమ్మెద ధ్వని వంటి కూత ఈ లక్షణములు గలది కుంభీనస సర్పం అనబడును. ఇది అన్ని దేశాలలో ఉండును.

 *  శోణముఖ సర్ప లక్షణం  - 

          స్పటిక ఛాయ గల శరీరం , పద్మరాగ మణి వంటి శిరస్సు , అతి భయంకరమైన కామక్రోధములు , భయంకరమైన గర్జన , 12 మూరల పొడవు గల శరీరం కలిగి ఉండునది శోణముఖ సర్పం అనబడును.

 *  లోహితాక్ష సర్ప లక్షణం  - 

         నల్లని వర్ణం, భూమి నుండి చెట్ల పైకి , చెట్ల పై నుంచి భూమి పైకి దుముకుట , బారెడు పొడవు గల శరీరం , అగ్ని కణముల వంటి నేత్రములు , భయంకర ఆకారం కలిగి ఉండును.

 *  ఛత్రపతి సర్ప లక్షణము - 

         5 మూరల పొడవు , అతిస్నిగ్ధమైన కోమలాకారం , సంచరించునప్పుడు శరీరం వికసించును. సంచరించనప్పుడు శరీరం ముడుచుకుని ఉండును. శ్వేత ఛత్రం గల శిరస్సు , సర్వ జంతువుల ధ్వనిని చేయగలిగి ఉండును. క్షణంలో ప్రాణం తీయును.రాత్రుల యందు చెట్ల మీద నివసించును . ఇది కేరళ నందు నివసించును . 

  మహాసర్పముల వివరణ  - 

     మహాసర్పములు మొత్తం 3 రకాలు  అవి 

  *  దాసరి పాము .

  *  కొండ చిలువ .

  *  సముద్రపు చిలువ .

 *  దాసరిపాము లక్షణము  - 

         60 మూరల పొడవు , బారెడు లావుగల శరీరం , శరీరం అంతా త్రిపుండ్రాకారం గల నామములు , కాటుక వంటి ఛాయ , ముఖం నందు ఊర్ద్వత్రిపుండ్రములు కలిగి ఉండునది దాసరిపాము అని చెప్పబడును . దీనికి దొరికిన ఏ జంతువుని అయినా బిర్రుగా చుట్టుకుని చంపి దిగమింగును.

 *  కొండచిలువ లక్షణము  - 

         నూరు మూరల పొడవు , మూడు బారల వలయము , వెడల్పు గల తెల్లని పొడలు , నీలవర్ణం గల శరీరం కలిగి ఉండునది కొండచిలువ అని చెప్పబడును . ఇది ఏ జంతువుని అయినా చటుక్కున మింగి చెట్టుకు చుట్టుకుని నీల్గును . అంతట పొట్టలోని జంతువు జీర్ణం అగును.ఇది కొండల యందు మాత్రమే నివసించును . 

 *  సముద్రపు పాము లక్షణము  - 

          మిక్కిలి పొడవు , స్థూలమగు శరీరం గలది . దీనిచేత కరవబడిన మనిషిని భూమి పైకి తీసుకొచ్చి చికిత్స చేసిన విషము హరించదు. సముద్రము నందు ఉంచే చికిత్స చేయవలెను . 

          *  సర్పజాతి వివరణ సంపూర్ణం *

      ఇప్పుడు మీకు సర్పాలు కాటువేసినప్పుడు చేయవలసిన చికిత్సల గురించి వివరిస్తాను.   
 
     సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు -

    
    అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

 *  1వ చికిత్స -
    
          ఏ సర్పం కోపోద్రేకంతో ఉండునో అట్టి సర్పం నోటి నుండి పొగ వెడలుచుండును. యే మనుజుడు అయినా అట్టి సర్పముచే కరవబడినను ఆ సర్పం వదిలిన పొగచే స్మృశించబడిన ఆహార పదార్థాలను భక్షించిన వెంటనే విషం ఎక్కును.ఆ విషాన్ని చికిత్సల ద్వారా తొలగించవలెను .  వెంటనే ఆ విషార్తునకు ఆవుపాలు , ఆవునెయ్యి , తేనె సమాంతరములుగా కలిపి అందు రెండు గురిగింజల అంత వత్సనాభిని కలిపి త్రాగించి గాయమునకు కూడా వత్సనాభిని కరిచినచొట పైపూతగా రాయవలెను .వెంటనే విషం హరించును . 

 *  2 వ చికిత్స  - 

           సర్పం కాటువేసిన వానికి వెంటనే  ఎడమ ముక్కునందు చెవిలో గులిమి పట్టించి మనిషి మూత్రం ఆ ముక్కులో ఉంచిన విషం ఎక్కదు.

 *  3 వ చికిత్స  - 

           నేలగుమ్ముడు గడ్డను గంథం తీసి కాటువేసిన చోట లేపనం చేసిన విషం హరించును . దీని చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును. 

 *  4 వ చికిత్స  - 

            పెన్నేరు గడ్డ అనగా అశ్వగంధ , చిర్రివేరు , మహిసాక్షి , కరిదువ్వ ఈ వస్తువులను గోమూత్రం తో నూరి పట్టించిన సర్పవిషం హరించును . విషంని హరించుటలో దీన్ని మించిన గొప్ప ఔషదం లేదు .

 *  5  వ చికిత్స  - 

          ఆగాకర గడ్డ ని గంథం తీసి అనగా సానమీద అరగదీసి ఆ గంధాన్ని తీసి కాటువేసిన స్థలం నందు దానిని పూసిన విషం హరించును . 

 *  6 వ చికిత్స - 

          కాటువేసిన స్థలం నందు జిల్లేడు వేరు అరగదీసి పట్టించినను లేదా ఎర్ర చిత్రమూలం , ఆరుద్ర పురుగు కలిపి నూరి పట్టించినను విషం విరుగును.

 *  7 వ చికిత్స  - 

          కరక్కాయ , తేనె , మిరియాలు , ఆకుపత్రి , ఇంగువ, మణిశిల , వస వీనిని సమానంగా నీరు వేసి నూరి ముక్కులో వేసిన సర్పముచే కరవబడిన వాడు జీవించును.

 *  8 వ చికిత్స  - 

           మణిశిల , ఇంగువ, వస , త్రికటుకములు అనగా శొంటి,పిప్పిళ్లు , మిరియాల సమాన చూర్ణం , కరక్కాయలు, లవంగచెక్క, ఆకుపత్రి అనునవి సమానంగా తీసుకుని నీటితో కలిపి నూరి ముక్కులో వేసినచో ఎంత విషపూరితమైన సర్పం కరిచినను ఆ వ్యక్తి బ్రతుకుతాడు.

 *  9 వ చికిత్స  - 

           దేవకాంచన చెట్టు వేరు గంధంని ముక్కులోపల వేసినచో అసాధ్యం అయిన సర్పవిషం హరించును . 

 *  10 వ చికిత్స  - 

           నేపాళపు గింజల్లోని పప్పులను నిమ్మపండ్ల రసంలో 21 సార్లు భావన చేయవలెను . భావన అనగా నిమ్మపండ్ల రసంలో గింజల్లోని పప్పు నానబెట్టి మళ్ళీ పూర్తిగా ఎండించడం మరలా నానబెట్టి మరలా ఎండించడం ఈ విధముగా 21 సార్లు చేయవలెను . ఆ తరువాత దానికి ఉమ్మి తో నూరి కణికలు చేసి ఎండించి మాత్రలులా చేసుకోవలెను . కావలసినప్పుడు ఉమ్మితో అరగదీసి కాటువేసిన స్థలం నందు లేపనం చేయవలెను . తరువాత కన్నులకు కాటుక వలే ఆ గంధాన్ని పట్టించవలెను  . విషం విరిగిపోవును.

 *  11 వ చికిత్స  - 

              గుంటగలగర వేఱు గాని , తిప్పతీగ వేఱు కాని , త్రిశూలి చెట్టు వేఱు గాని నీటితో నూరి లోపలికి తీసుకుని కాటువేసిన స్థలం నందు పూయడం వలన సర్పవిషం హరించును . 

 *  12 వ చికిత్స  - 

                భావంచి విత్తనాలు గోమూత్రంలో నానబెట్టి గోమూత్రంతోనే నూరి లోపలికి తాగవలెను . 

 *  13 వ చికిత్స - 

             తెల్లగురిగింజ వేరుని నోటిలో ఉంచుకుని రసం మింగుచున్న సర్పవిషం హరించును .

 *  14 వ చికిత్స  - 

             అశ్వగంధ సమూలం మేక మూత్రంతో నూరి దానినే గాయమునకు పట్టించిన సర్వ జంతువుల విషంని హరించును . 

 *  15 వ చికిత్స  - 

             నల్ల ఉమ్మెత్త వేఱు చిన్న ముక్కను తీసుకుని 10 ml కానుగ విత్తనాల నూనె వేసి నూరి మాత్ర వలే చేసి పుక్కిట పట్టుకొని ఆ మాత్రని నిమ్మపండ్ల రసముని కలిపి త్రాగిన సర్పవిషం హరించును . 

 *  16  వ చికిత్స  - 

             అత్తిపత్తి చెట్టు వేఱు అనగా దీనిని పట్టుకున్నచో ఆకులు ముడుచుకొనిపోవును . మరియు నీలివేరు ను మంచి నీటితో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజ లోని పప్పుల గంధమును కాటువేసిన స్థలం నందు పట్టించిన సర్పవిషం హరించును . 

 *  17  వ చికిత్స  - 

              గొమూత్రంలో గాని మనుష్యుని మూత్రంలోగాని పాత నెయ్యిలో గాని పసుపు చూర్ణం కలిపి తాగించిన సర్పవిషము హరించును . 

 *  18 వ చికిత్స  - 

            పాము కరిచిన వెంటనే నరమూత్రం సేవించిన విషం ఎక్కదు.

 *  19 వ చికిత్స  - 

          కటుకరోహిణి , నేలతాడిగడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పవిషం హరించును . 

 *  20 వ చికిత్స  - 

          కుంకుడువేరు నూరి కుంకుడు గింజ ప్రమాణంలో పుచ్చుకొనిన సర్పవిషం హరించును . 

 *  21 వ చికిత్స  - 

          నాగముష్టి వేరు నూరి రసం తీసి తాగిన అన్ని రకాల సర్పవిషాలు హరించును . 

 *  22 వ చికిత్స  - 

           జిల్లేడు యొక్క లేత మొగ్గలని కోసి ఆ మొగ్గలు తెంచునపుడు స్రవించు పాలను ఒక గ్లాసులో పట్టి ఆ పాలతో ఆ మొగ్గలను నూరి రేగు పండు ప్రమాణం మాత్రలను చేసి ఆ మాత్రలను తమలాపాకులో చుట్టి గంటకి ఒకసారి  మింగించిన సర్పవిషం హరించును . ఇలా 6 మాత్రలు కు తక్కువలేకుండా మింగించవలెను . మింగలేని స్థితిలో ఉన్నచో నీటితో కలిపి తాగించవలెను . 

 *  23 వ చికిత్స  - 

           జిల్లేడు ఆకులకు ఇరువైపులా అంటుకొని ఉండే దూది వంటి తెల్లని నునగును గీచి ఒక గాజుపాత్రలో వేసి జిల్లేడు లేత మొగ్గలను తుంచునప్పుడు తొడిమలు నుండి స్రవించు పాలతో తడిపి చేతితో చక్కగా పిసికి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి నీడలో ఎండపెట్టి ఆ మాత్రలకు గాలి తగలకుండా సీసాలో వేసి కార్క్ మూత బిగించి ఈ మాత్రలను గంటకొకటి చొప్పున మూడు గంటలసేపు మింగించిన సర్పవిషం నిస్సందేహంగా నివర్తించును.  

          ఈ మాత్రలు తయారుచేసిన రెండు నెలల వరకే పనిచేయును . కావున రెండు నెలలోకసారి ఈ మాత్రలు తయారుచేసి నిలువ ఉంచుకొనవలెను .

       * సర్ప విష చికిత్సలు సంపూర్ణం *

 గమనిక  - 

          కొంతమంది ప్రాచీన వైద్య పండితులు పాము కరిచిన సాధారణంగా మనుషులకు మృతి సంభవించదు అని తమతమ గ్రంథాలలో వివరించారు . పాము కరిచినవారికి స్మృతి తప్పి ఉచ్వాస నిశ్చ్వాసములు ఆగి , హృదయచలనం ఆగి నాడిగమనం ఆగి ఉన్న సమయంన  మృతుడు అయినట్టు నిర్ణయించుకుని చక్కగా కూర్చొండబెట్టి 500 వందల బిందెల నీటిని నెత్తిన ధారగా పోసిన బొందిలోకి ప్రాణం వచ్చి లేచును. 

                     ఈ విధంగా చేసినను ప్రాణం రానిచో ఒక గచ్చు తొట్టిలో కాని , చెక్క తొట్టిలో కాని నిండుగా నీరు నింపి మూడు దినములు ఉంచిన ఉదకం నుండి బుడగలు వచ్చును. బుడగలు మొదలు అయినచో శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది అని అర్థం. ఈ విధంగా బుడగలు మొదలయిన గడియ తరువాత కాటు తిన్న వాని శరీరం బయటకి తీసి కూర్చుండబెట్టి శిరస్సు పై నుంచి నీటిని ధారగా పోయుచున్న ప్రాణములు నిలబడును. నీటిలో ఉంచినప్పుడు బుడగలు రానిచో మృతుడు అని నిర్ణయించవలెను .  

         సిద్దనాగార్జున తంత్రం నందు తొమ్మిది దినముల వరకు నీటియందు ఉంచవలెను అని ఉన్నది. పాముచే కరవబడిన వాడు చనిపోయినచో వానిని మరలా ఆ సర్పం వలన గాని లేదా మరియొక సర్పం చేత కాని కరిపించినచో కాటు తిన్నవాడు బ్రతుకును కాని సర్పం మరణించును. బహుశా పాముకాటు తిన్నవాడు శరీరంలోని అవయవాలు పనిచేయని ఒక రకమైన అచేతన స్థితికి చేరుకుంటాడు కావోచ్చు ఉదకం సహాయంతో అతన్ని మరలా సాధారణ స్థితికి తీసుకురావొచ్చు అని ఆయుర్వేద పండితుల ఉవాచ కావోచ్చు . 

         నేను చదివిన కొన్ని గ్రంథాలలో పాముకరిచిన వెంటనే ఆ పాముని కాటు తినినవాడు పట్టుకొని కరవాలి అని లేదా మట్టిపెడ్డని నమిలి కాని పాముకాటు పైన కాల్చి కుంకుడు ఆకు నలుగగొట్టి కట్టిన సర్పవిషం హరించును అని ఉన్నది.

 పాములు దగ్గరకు రాకుండా ఉండుటకు రహస్య క్రియలు  - 

 *  1 వ ప్రక్రియ  - 

          పుష్యమి నక్షత్రం నందు సంగ్రహించబడిన తెల్ల జిల్లేడు వేఱు , తెల్ల గలిజేరు వేఱు బియ్యపు కడుగుతో నూరి త్రాగినను , ఆ నక్షత్రం యెక్క సమయం నందు ఆ మూలికలను నూరి బియ్యపు కడుగులో చేర్చి పూసుకుని స్నానం చేయవలెను . ఇలా సంవత్సరంకి ఒకమారు చేయడం వలన  ఆ మనిషి దగ్గరకి సర్పాలు వెళ్లవు . సర్పభయం ఉండదు.

 *  2 వ ప్రక్రియ  - 

            సూర్యుడు మేషరాశి యందు ఉండగా చిరుశెనగలు , వేపాకు కలిపి భక్షించిన ఒక సంవత్సరం వరకు సర్పభయం ఉండదు.

 *  3 వ ప్రక్రియ  - 

             ఆషాడ శుక్ర పంచమి నాడు సంగ్రహించబడిన దిరిసెన చెట్టు వేరుని దూపదీపనైవేద్యములు వొసగి నడుముకి కట్టుకుని బియ్యపు కడుగుతో ఆ వేరుని నూరి తాగిన ఆ సంవత్సరం సర్పభయం ఉండదు. ఇటుల చేసిన వానికి యే కారణం వల్లనైనా పాము కరిచినను పామే చచ్చును.

 *  4 వ ప్రక్రియ  - 

              దూసరి తీగ వేరుని తెచ్చి నివశించే గృహము నందు కనపడునట్టు వ్రేలాడదీసిన సమస్త విషజంతువులు అన్నియు దూరంగా పారిపోవును . 

 *  5 వ ప్రక్రియ  - 

             పుష్యమి నక్షత్రం నందు తిప్పతీగ వేరుని తెచ్చి కణికలుగా ఖండించి దారము నకు మూలికగా గుచ్చి కంఠం నందు ధరించినచో సర్పభయం కలగదు. పాముకాటు వేసిన వాని కంఠం నందు వేసిన విషం దిగును.

 *  6 వ ప్రక్రియ  - 

             పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం నందు బియ్యం కడుగుతో తెల్లగలిజేరు వేరు నూరి తాగిన మనుజునిని చూసిన సర్పం వెంటనే పారిపోవును . అట్టి మనిషికి సర్పభీతి ఉండదు.

 *  7 వ ప్రక్రియ  - 

             తెల్ల గంటెన వేరును బియ్యపు కడుగుతో నూరి పుచ్చుకొనిన మనుజుని కి 6 మాసముల వరకు సర్పభయం కలగదు.

 *  8 వ ప్రక్రియ  - 

             దూసరి తీగ వేఱు ఉదకంతో నూరి తాగినవానిని 6 మాసములు వరకు సర్పం కరవదు.దీనిని " గరుడ చూడామణి" అని పిలుస్తారు . 

  *  9 వ ప్రక్రియ  - 

             మనుజులు ప్రతి దినం పడుకొనే సమయం నందు అస్తిక మునిని గూర్చి ధ్యానించి నమస్కారం చేసి పడుకున్నచో ఆ మనుషులకు సర్పభయం లేకపోవుటయే కాక స్వప్నం నందు కూడా సర్పాలు కనపడవు.

 *  10 వ ప్రక్రియ  - 

           గొడుగు వేసుకొని ఆవాలు పిడికిటపట్టుకొని రాత్రియందు గాని , పగటి యందు గాని ఏ మనుజుడు సంచరించునో వాని ఛాయ పడినను , శబ్దము వినినను సర్పములు భయపడి పారిపోవును .

 *  11 వ ప్రక్రియ  - 

           అతిమధురం , విప్పకర్ర  ఈ రెండింటిని చేర్చి మంట వేసినచో ఆ జ్వాలను చూసి నాగుపాములు సైతం దగ్గరకి రావు . 

 *  12 వ ప్రక్రియ  - 

            సింహం దంతంతో గరుడ విగ్రహంని చేయించి రాగి లేక బంగారు తాయత్తు లో పొదిగి శరీరం నందు ధరించిన వానిని చూడగానే సర్పములు పలాయనం చిత్తగించును . 

           పైన చెప్పబడిన రహస్యతంత్రాలలో మీకు ఏది వీలుగా ఉంటుందో అది ప్రయత్నించండి. ముఖ్యముగా అరణ్యములలో సంచరించేవారు , రహస్య ప్రదేశాలలో తిరిగేవారు తప్పనిసరిగా పైన చెప్పిన తంత్రాలు పాటించటం చాలా మంచిది 

          పాముకాటు గుండ్రంగా ఉండినను , నేరేడు పండు వర్ణం కలిగి ఉండినను , నీలపు వర్ణం కలిగి ఉండినను , రక్తహీనం అయ్యి తెల్లగా ఉండినను , రక్తం గూడుకట్టి ఎర్రగా ఉండినను వాడు దేవజాతి అయిన వాడు అయినను బ్రతకడు ఇది నిశ్చయం ...

         నేటితో సర్పాలు గురించి పూర్తి వివరణ వాటి చికిత్సా విధానాలు గురించి పూర్తిగా తెలియచేశాను . అదేవిధంగా సర్పాల నుంచి రక్షించుకొనుటకు కొన్ని ప్రక్రియలు కూడా వివరించాను.  మరలా ఒక మంచి పొస్టుతో మీ ముందుకు వస్తాను . 

  

Saturday, 15 August 2020

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*


1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్ 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  
3. మంజునాథ్.
*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్
*సముద్రమే వెనక్కివెళ్లే* 
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
*స్త్రీవలె నెలసరి* అయ్యే 
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  
2. కేరళ దుర్గామాత.
*రంగులు మారే ఆలయం.* 
1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 
 1. కాణిపాకం,  
2. యాగంటి బసవన్న,  
3. కాశీ తిలభండేశ్వర్,  
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

*స్వయంభువుగా* 
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 
1. బదరీనాథ్,  
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం. 

*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 
హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.

*స్వయంగా ప్రసాదం* 
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

*మనిషి వలె గుటకలు*  
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 

*ఛాయా విశేషం* 
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్

*ఇంకా...* 
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 
చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc

*పూరీ* 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.

ఇవి మన దేశం లో ఉన్న, మనకు తెలిసిన కొన్ని మహిమాన్విత హిందూ దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.🕉💐💐💐🙏🙏

Thursday, 6 August 2020

శ్రీ_వేంకటేశ్వర_దివ్య_చరిత్ర 🌊 #తిరుమల_పుష్కరిణి 🌊



శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. 

తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. 

ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నదీ గమనార్హం
తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది.

స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి.

శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం.

*కుబేర తీర్థం..* శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి.

*గాలవ తీర్థం..* స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా, లేదా ఇందులో స్నానం చేసినా ఇహ, పర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

*మార్కండేయ తీర్థం...* శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుంది.

*అగ్ని తీర్థం - యమతీర్థం...* వేంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయమూలలో అగ్ని దేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది.

*వసిష్ట తీర్థం...* వసిష్ట మహర్షిచే నైరృతి దిశలో నిర్మింపబడిన వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి.

*వరుణతీర్థం - వాయుతీర్థం..* స్వామి వారి పుష్కరిణిలో పడమట వరుణతీర్థం, వాయుమూలన వాయుతీర్థంలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి.

*సరస్వతి తీర్థం...* కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది.

ఈ తొమ్మిది తీర్థాలలో ఒకేరోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది.

స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ ఈ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి.

వేంకటాచలం మీది ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు.

తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే



గోవిందా గోవిందా